ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది మహిళల హత్య: చివరకు హంతకుడికి జీవితఖైదు
హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మహిళలను దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. కల్లు, మద్యం తాగే మహిళలే లక్ష్యంగా దాడులు చేసి, వారిపై ఉన్న బంగారు, వెండి నగలను దోచుకునే వాడు. అంతటితో ఆగకుండా వారిని నిర్మానుష్య ప్రదేశాల్లో దారుణంగా హత్య చేసేవాడు. దోషిగా తేలడంతో ఆ నరహంతకుడికి గద్వాల కోర్టు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. చివరకు తన సొంత తమ్ముడిని కూడా నిందితుడు హత్య చేయడం గమనార్హం.

నరహంతకుడు గుండేడు ఎరుకలి శ్రీను
ఆ వివరాల్లోకి వెళితే.. 2019, డిసెంబర్ 17న మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం దోకూరు గ్రామ శివారులో నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ(53) మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీం ఇచ్చిన సమాచారంతో ఆమె హత్య కేసులో పాత నేరస్థుల పాత్ర ఉందని నిర్దారించారు. పలువురు నిందితులను విచారించారు. బాలానగర్ మండలం గుండేడుకు చెందిన ఎరుకలి శ్రీను(47)ను కూడా అనుమానించి విచారించగా.. ఆ నరహంతకుడు అతడేనని తేలింది. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

దోషిగా తేలడంతో జీవిత ఖైదు విధించిన కోర్టు
గద్వాల కోర్టులో విచారణలో భాగంగా నేరు రుజువు కావడంతో నిందితుడు శ్రీనుకు జీవిత ఖైదు విధిస్తూ గద్వాల మూడో అదనపు జిల్లా జడ్జి శివకుమార్ గురువారం తీర్పు ఇచ్చారు. దీంతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించారు. కాగా, 2017లో సొంత తమ్ముడిని చంపిన కేసులోనూ శ్రీను జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లకు వచ్చిన మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లి బయటికొచ్చాడు.

ఉపాధి కల్పించి మార్చేందుకు ప్రయత్నించినా.. హంతకుడిగానే..
చివరిసారిగా 2018 ఆగస్టులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అధికారులు అతని మార్పు వస్తుందని.. జిల్లా జైలులోని పెట్రోల్ బంకులో ఉపాధి కల్పించారు. అయితే, సరిగ్గా విధులకు హాజరుకాకపోవడంతో తొలగించారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తే మళ్లీ విధుల్లోకి చేర్చుకున్నారు. అయినా కూడా అతడు విధులకు సరిగ్గా హాజరుకాలేదు. అంతేగాక, ఆ సమయంలోనే జిల్లాలోని మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో నాలుగు హత్య చేశాడు. కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో టీఎస్ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ ఎముకల గూడు లభించింది. ఈ హత్యను ఎరుకలి శ్రీను చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే సమయంలో దేవరకద్రలో మరో హత్య వెలుగుచూసింది. అప్పటి ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో శ్రీనును అరెస్ట్ చేశారు. ఈ హత్యలన్నీ రుజువు కావడంతో నిందితుడు శ్రీనుకు కోర్టు జీవిత ఖైదు విధించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications