వచ్చే 3 రోజులు తెలంగాణలో వర్షాలు.. ఈ సారి సాధారణ వర్షపాతమే: ఐఎండీ
నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. నైరుతి నుంచి వీచే గాలులు క్రమంగా బలపడుతున్నందున.. ఉత్తర- దక్షిణ ద్రోణి తెలంగాణ రాష్ట్రం పై ఉందని ఆమె వెల్లడించారు.
Recommended Video
వచ్చే 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇవాళ కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి ఇతర చోట్ల వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం ఒకటి, రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇటు మధ్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం ఉంటుందని ఐఎండీ చెప్పింది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఉంటాయని, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా పేర్కొన్నది. వాయువ్య భారతంలో లేహ్, లడఖ్ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని.. జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటుందని వివరించింది.
పసిఫిక్, భారత మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రత పరిస్థితులు రుతు పవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతున్నందున.. ఈ మహాసముద్ర బేసిన్లపై సముద్ర ఉపరితల పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇంతకు ముందు నైరుతి రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం కానుందని పేర్కొంది. ఈ నెల 3న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని చెప్పింది.