5 శాతం మందికే కరోనా లక్షణాలు.. బీ అలర్ట్, ప్రజలకు మంత్రి ఈటల సూచనలు
కరోనా సెకండ్వేవ్లో వైరస్ బారిన పడిన వారిలో 5 శాతం మందికే లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ , ఫ్రంట్లైన్ వారియర్స్కు వందకు వంద శాతం టీకాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ప్రతి పిహెచ్సిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. రోజుకు 10 లక్షల టీకాలు వేసే సామర్ధ్యం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.
కరోనా బారిన పడిన వారందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు తగినన్ని ఉన్నాయని చెప్పారు. బెడ్ల కొరత ఉందనే ప్రచారంలో నిజం లేదన్నారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఈటల తెలిపారు. సెకండ్ వేవ్లో తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సీజన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపతున్నట్టు తెలిపారు. ఆ చర్చలు సఫలం అవుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని చెప్పారు. కరోనా కేసులు పెరిగితే 350 టన్నుల అవసరం ఉండొచ్చని చెప్పారు. రోగులకు అవసరమైన చికిత్స అందించే విషయంలో వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. వారి సేవలను ప్రశంసించకుండా ఉండలేమని చెప్పారు.