లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?
హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 795 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. ఇక మెదక్ లో అత్యల్పంగా 20 నామినేషన్లు వచ్చాయి.

మొత్తం 795.. బరిలో మిగిలేది ఎందరో?
తెలంగాణలో లోక్సభ నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఈనెల 18వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ సోమవారం (25.03.2019) నాటితో ముగిసింది. మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు గాను ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. నామినేషన్ల సమయం ముగిసేటప్పటికీ మొత్తం 795 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలుస్తారో తేలనుంది.

నామినేషన్ల వెల్లువ
నిజామాబాద్ నుంచి అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా మెదక్ నుంచి 20 దాఖలయ్యాయి.
సెగ్మెంట్ల వారీగా చూసినట్లయితే నిజామాబాద్ - 245, సికింద్రాబాద్ - 67, నల్గొండ - 48, భువనగిరి - 45, మల్కాజిగిరి - 43,
ఖమ్మం - 38, పెద్దపల్లి - 35, మహబూబ్ నగర్ - 34, హైదరాబాద్ - 32, చేవెళ్ల - 32, నాగర్ కర్నూల్ - 32, వరంగల్ - 29,
కరీంనగర్ - 26, మహబూబాబాద్ - 26, జహీరాబాద్ - 22, ఆదిలాబాద్ - 21, మెదక్ నుంచి 20 నామినేషన్లు వచ్చాయి.

అన్నీ పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు
కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. సీపీఎం - ఖమ్మం, నల్గొండ, సీపీఐ - మహబూబాబాద్, భువనగిరి, తెలంగాణ జన సమితి - మహబూబాబాద్, ఖమ్మం, హైదరాబాద్, జనసేన - మహబూబాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నుంచి బరిలో దిగాయి.
స్టార్ క్యాంపెయినర్లుగా తమ తరపున ప్రచారం చేసే వారి వివరాలు ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించాయి.
కాంగ్రెస్ నుంచి 40 మంది, బీజేపీ నుంచి 40 మంది, సీపీఎం నుంచి 40 మంది, టీఆర్ఎస్ నుంచి 20 మంది, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి 40 మంది, జనసేన నుంచి నలుగురు స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేయనున్నారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొనడానికి వాహన శ్రేణి పాస్లు ఇవ్వనున్నట్లు రజత్ కుమార్ తెలిపారు.

నిజామాబాద్ లో బ్యాలెట్ తప్పదా?
లోక్సభ నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ఎన్నికల తంతుపై ఆసక్తి నెలకొంది. ప్రచార పర్వంలో దూసుకెళ్లడానికి ఆయా పార్టీల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఇక మంగళవారం (26.03.2019) నాడు నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. ఫారం ఏ, బీ సక్రమంగా పూరించకపోయినా.. ఫారం 26లో అన్ని కాలమ్స్ను నింపకపోయినా.. అలాంటి నామినేషన్లను తిరస్కరిస్తామన్నారు. ఈ నెల 28వ (గురువారం) తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ చేపడతామన్నారు రజత్ కుమార్. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత నిజామాబాద్ బరిలో 95 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బ్యాలెట్ పేపర్పై మొదటి భాగంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యముంటుందని.. రెండో భాగంలో గుర్తింపు పొందిన ఇతర పార్టీలకు.. ఆఖర్లో స్వతంత్రులకు ఇంగ్లీష్ అల్ఫాబెట్ ప్రకారం గుర్తులను కేటాయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications