90 శాతం మందికి కరోనా.. తన ఆఫీసులోనే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో అయితే మరీ ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఢిల్లీలో గల తన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. హైదరాహబాద్ నారాయణగూడలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడారు.
15-18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు ఇప్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గేవరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో కోవిడ్ పరిస్ధితిపై ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. టీనేజ్ వయస్సు గల వారందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని వేగంవంతం చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నేటి నుంచి బుూస్టర్ డోస్ వేయనున్నారు.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
ఇటు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.