విషాదం: హాస్టల్ భవనంపైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బీఎన్ రెడ్డినగర్లోని జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తికి చెందిన 21 ఏళ్ల రమ్య ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శోభన్ రెడీమిక్స్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి కాలేజీ దూరంగా ఉండటంతో కొంతకాలంగా బీఎన్ రెడ్డినగర్ లోని లక్ష్మీదుర్గా ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది.
కాగా, శనివారం రాత్రి హాస్టల్ రెండో అంతస్తుపైన ఉన్న రెయిలింగ్ పై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతోంది. అయితే, ఒక్కసారిగా అదుపుతప్పి వెనక్కి పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి చికిత్స పొందుతూ రమ్య మరణించింది.
కూతురు మరణవార్త విని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.