వేధింపులు తాళలేక బ్యూటీషియన్ ఆత్మహత్య: మరణించిన ఆగలేదు!
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే(మార్చి 8న) ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బ్యూటీషియన్గా పనిచేస్తున్న ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నగరంలోని మైలార్దేవ్పల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటో చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... లక్ష్మీగూడకు లీజ(19) అనే యువతి బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమెను అష్రాఫ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ విషయాన్ని యువతి తన కుటుంబసభ్యులకు తెలిపింది.
ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు పలుమార్లు అష్రాఫ్ను మందలించారు. అయినా అతడు వేధింపులు ఆపలేదు. ఈ నేపథ్యంలో అతని వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా బాధిత యువతి ఫోన్లో 35 మిస్డ్ కాల్స్ ఉన్నాయని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన అష్రాఫ్కు బడా నాయకుల అండదండలు ఉన్నందువల్లే పోలీసులు కూడా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, యువతి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. యువతి కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న అష్రాఫ్ కోసం గాలింపు చేపట్టారు.