సిద్దిపేటలో దారుణం .. ఓ తల్లి కర్కశం .. అంగట్లో ఆడపిల్ల విక్రయం
ఆడ, మగ తేడా లేదని .. ఆడ పిల్లలు సైతం కూడా అన్ని రంగాల్లో మగవాళ్లకు దీటుగా ముందుకు వెళుతున్నారని ఎవరు ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఆడ పిల్లల మీద వివక్ష కొనసాగుతూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించిన నేటి రోజుల్లోనూ ఆడపిల్లలు అంగట్లో బొమ్మల్లా విక్రయాలకు గురవుతూనే ఉన్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఓ అభంశుభం తెలియని 15 రోజుల పసికందు విక్రయం కలకలం రేపింది.

ఆడ శిశువును రూ. 35 వేలకు విక్రయించిన తల్లి
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, ఆ పసి దాని పట్ల కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేయాల్సిన తల్లి, ప్రసవం తర్వాత 15 రోజులైనా కాకముందే పాపను విక్రయించింది. 35 వేల రూపాయలకు పసిపాపను అమ్మేసిన తల్లి అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది.
మిరుదొడ్డి మండలం మల్లపల్లికి చెందిన ఓ మహిళ ఈనెల 14వ తేదీన ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించింది. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. భూమిపై అడుగు పెట్టి పదిహేను రోజులైనా కాకముందే ఆ ఆడబిడ్డను అంగడి సరుకును చేసింది కసాయి తల్లి.

అంగన్వాడీ కార్యకర్త ద్వారా వెలుగులోకి
ఇక ఈ విషయం చిన్నారికి టీకా వేయడానికి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్త ద్వారా బయటకు వచ్చింది. పసిబిడ్డ పుట్టిన తర్వాత, అధికారిక వివరాల ప్రకారం 15 రోజుల తర్వాత చిన్నారికి వేయడానికి ఇంటికి వెళ్ళింది అంగన్వాడీ కార్యకర్త. అయితే పాప లేకపోవడంతో తల్లిని నిలదీసింది. పాపను ఏం చేసావ్ అని ప్రశ్నించింది. దీంతో తానే తన బిడ్డను 35 వేల రూపాయలకు అమ్మేసినట్లుగా అంగన్వాడీ సిబ్బందికి తెలిపింది సదరు తల్లి.
ఎవరికీ చెప్పొద్దని ప్రాధేయపడింది .

అంగన్వాడీ కార్యకర్త ఫిర్యాదుతో తల్లిని విచారిస్తున్న అధికారులు
తల్లి చిన్నారిని కనికరం లేకుండా అమ్మేసిన ఘటన తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త షాక్ తింది .వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చింది. అంగన్వాడీ కార్యకర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు తల్లి పసిబిడ్డను ఎవరికి విక్రయించింది ?ఎందుకు విక్రయించింది ? వంటి అనేక విషయాలపై కూపీ లాగుతున్నారు. తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి, పసిబిడ్డను తిరిగి తల్లి ఒడికి చేర్చేలా ప్రయత్నం మొదలుపెట్టారు శిశు సంక్షేమ శాఖ అధికారులు.












Click it and Unblock the Notifications