టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు: సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణలో కలకలం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించనున్నారు.
నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మీనారాయణ సిట్లో సభ్యులుగా నియమించారు.
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును కొనసాగించడానికి మొయినాబాద్ పోలీసులకు హైకోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఈ క్రమంలో నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో ప్రశ్నించనున్నారు. నిందితులు పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడంతో సిట్ దానిపై ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికీ పంపించారు.
ప్రధాన నిందితుడు రామచంద్రభారతి నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని బంజారాహిల్స్ పీఎస్లో మరో కేసు తాజాగా, నమోదైంది. వీటిపైనా సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతితోపాటు సింహయాజి, నందకుమార్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.