శివబాలాజీ చేయి కొరికిన హేమ : ప్రకాశ్ రాజ్ -నరేష్ ఫేస్ టు ఫేస్ : "మా " పోలింగ్ లో అనూహ్య పరిణామాలు..!!
"మా " ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా బయట వ్యక్తి వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణతో మొదలైన వివాదం తారా స్థాయికి చేరింది. ఒకరి పైన మరొకరు దూషణలకు దిగారు. ఆ సమయంలో అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ ..విష్ణు ప్యానల్ కు మద్దతు ఉన్న తాజా మాజీ అధ్యక్షుడు నరేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక సమయంలో ఇద్దరూ సహనం కోల్పోయారు. ఒకరి పైకి మరొకరు దూసుకెళ్లే ప్రయత్నం చేసారు.
నరేశ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్
ఆ సమయంలో రెండు ప్యానళ్లకు సంబంధించి కొందరు సభ్యులు ఆవేశానికి లోనయ్యారు. ఒకరి పైన మరొకరు దూషణలకు దిగారు. మోహన్ బాబు అక్కడకు చేరుకున్నారు. ఇక, రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవ సమయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన హేమను అడ్డుకొనేందుకు శివ బాలాజీ ప్రయత్నించారు. దీంతో.. హేమ ఆ సమయంలో శివ బాలాజీ చేయి కొరికారు. ఇదే విషయన్ని మీడియా ముందుకొచ్చి శివ బాలాజీ చేయి చూపిస్తూ తన చేతిని కొరికిన గాట్లు..రక్కిన విషయాన్ని చూపించారు.
శివ బాలాజీ చేయి కొరికిన హేమ
శివబాలాజీ చేతిని హేమ కొరికారంటూ నరేశ్ వెల్లడించారు. ఆ తరువాత తాను ఊరికే కొరకలేదని..అన్ని విషయాలు పోలింగ్ అయిన తరువాత మాట్లాడుతానని హేమ చెప్పుకొచ్చారు. రెండు శిబిరాల నుంచి గొడవ జరగకుండా ఉండేందుకు తాను ప్రయత్నించానని..ఆసమయంలో హేమ కొరికారని శివ బాలాజీ చెప్పుకొచ్చారు. అయితే, బయటకు వచ్చిన ప్రకాశ్ రాజ్.. విష్ణు మాత్రం అసలు ఎక్కడా గొడవ లేదని అంతా ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చారు. నో బైట్స్.. ఓన్లీ ఓట్స్ అని నరేశ్ పిలుపునిచ్చారు.
తన ఓటు గురించి నాగబాబు ఓపెన్ గా
ఇక, ఓటు వేసిన మెగా బ్రదర్ నాగబాబు తాను ప్రకాశ్ రాజ్ కు ఓటు వేసినట్లుగా బయటకు చెప్పేసారు. తాను ప్రకాశ్ రాజ్ వర్గానికి మద్దతుగా ఓటు వేసానని వెల్లడించారు. మా లో రగడ జరుగుతోందని చెప్పారు. కానీ, తరువాత పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది. కొద్దిసేపు ఆగిన తరువాత పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. "మా " మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీ ఉంటేనే కిక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు పుట్టినిల్లు అని కథానాయిక జెనీలియా అన్నారు.
జెనీలియా కీలక వ్యాఖ్యలు
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు ఆమె దూరంగా ఉన్నారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అతి త్వరలో సూపర్ ప్రెసిడెంట్ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. భారీగా ఓటింగ్ జరుగుతున్న సమయంలో 500 పైగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికి 215 ఓట్లు పోలయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, దూషణలు..వ్యక్తిగత విమర్శలకు కారణమైన "మా " ఎన్నికల్లో ఇప్పుడు సినీ ప్రముఖులు చేతులు కొరికే దాకా వెళ్లటం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని పైన పోలింగ్ ముగిసిన తరువాత మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మధ్నాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల సమయానికి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.