తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ. 100 కోట్ల చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఉంటుందని గౌతమ్ అదానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, దాన కిశోర్, తదితరులు ఉన్నారు.
ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

స్కిల్ యూనివర్శిటీ లక్షలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడంతో పాటు ప్రొఫెషనల్ సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది. శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పించేందుకు ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. యూనివర్శిటీలో ప్రవేశం పొందడం వల్ల యువతకు ఉద్యోగానికి హామీ ఉంటుంది.
A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.
— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024
Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e
కాగా, బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి క్రమంగా కోర్సులను పెంచనున్నారు. ఈ వర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications