నేరుగా సభకు కాకుండా నోవాటెల్కు అమిత్ షా: బీజేపీ నేతలతో అత్యవసర భేటీ
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్లాల్సి ఉండగా.. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్కు వెళ్లారు. అక్కడే బీజేపీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించారు. వాస్తవానికి అమిత్ షా షెడ్యూల్లో ఈ సమావేశం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన రోడ్డు మార్గాన చేవెళ్లకు వెళ్లి అక్కడ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ, సడన్గా ఆయన నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశం అనంతరం నోవాటెల్ హోటల్ నుంచి చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభకు అమిత్ షా బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికలు సమయం దగ్గర పడుతోన్న సందర్భంలో అమిత్ షా ఈ సభలో ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో జోష్ నింపనున్నారు అమిత్ షా.
ఈ సభను రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా ప్రజలను సభకు తరలించారు. సభ అనంతరం అమిత్ షా నేరుగా రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా, ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. తాము కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నేతలు లక్ష్మణ్, విజయశాంతి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, తదితర నేతలు అమిత్ షాకు స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications