సైబరాబాద్ పరిదిలో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు..! నేరాలను అదుపు చేయడమే లక్ష్యం..!!
హైదరాబాద్ : నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు ప్రతి వీధిలో సిసి కెమెరాలు అమర్చుకోవాలని పోలీసు లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీలైన చోట పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనివార్యమైన చోట కాలనీ వాసులే సంఘటితమై కూడళ్లలో కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను అదుపులో ఉంచొచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కాకుండా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిదిలో శాంతి భద్రతల పర్యవేక్షణ తో పాటు నేరాలను అదుపుచేసేందుకు, నేరగాళ్లను గుర్తించేందుకు లక్ష సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు వెళ్తోంది.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో లక్ష సీసీ కెమెరాల లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 50 వేలకు పైగా ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ. సజ్జనార్ పేర్కొన్నారు. వాటి నిర్వహణకు నెలకు రూ.1.50లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా.. సోమవారం సీబీ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీసీకెమెరాల ఏర్పాటు కోసం రూ.10 లక్షల చెక్కును కమిషనర్కు అందించింది.
అడ్మిన్ అదనపున డీసీపీ కె.నరసింహ ఆధ్వర్యంలో సంస్థ ఎండీ సీబీఎం లూకోస్ కమిషనర్ను ఆయన కార్యాలయంలో కలిసి చెక్కును అందించారు. రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకే పరిమితం కాదని, ప్రజలూ భాగస్వాములు కావాలని సీపీ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఇతర సంస్థలూ ఇందుకు ముందుకువచ్చి సహకారం అందించాలని సజ్జనార్ కోరారు.