కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కంటే బండి సంజయ్ నే తోపు.. బీజేపీలో నెం.1 గా మారిన యువనేత
తెలంగాణ బీజేపీ అంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గురే. ఆ తర్వాతే ఎవరైనా. దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి.. ఈ ముగ్గురే బీజేపీ అగ్రనేతలుగా చలామణి అవుతున్నారనేది ఒక వాదన. అలాంటిది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్, కిషన్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. 2014 లో 5 స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఒకే ఒక్క సెగ్మెంట్ ను కైవసం చేసుకుంది. గోషామహల్ నుంచి రాజా సింగ్ ఒక్కరే బీజేపీ తరపున గెలిచారు.
అదలావుంటే బీజేపీ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 14,50,456 (7%) మంది ప్రజలు ఓట్లేశారు. అందులో 61,854 ఓట్లతో రాజా సింగ్ విజయం సాధించారు. ఆయన కంటే కూడా ఎక్కువ (66,009 ఓట్లు) సాధించి కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ బీజేపీలోనే టాప్ గా నిలిచారు. గోషా మహల్ నుంచి 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందితే.. బండి సంజయ్ ఆయన కంటే ఎక్కువగా 66,009 ఓట్లు సాధించిన కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు.

బండి సంజయ్ "షేర్".. నెం.1 యంగ్ లీడర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ అగ్రనేతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు నలుగురు తప్ప ఇతరులను ఎదగనివ్వరనే ఆరోపణలున్నాయి. అందుకే క్యాడరున్నా కూడా బీజేపీ విజయం సాధించలేకపోతుందనేది ఒక టాక్. కరీంనగర్ బీజేపీకి అన్నీ తానై వ్యవహరిస్తూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న బండి సంజయ్ విషయంలో కూడా రాష్ట్ర నేతలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తారనేది మరో కోణం.
అదలావుంటే అగ్రనేతలను మించి ఈ ఎన్నికల్లో బండి సంజయ్ దూసుకెళ్లారు. కరీంనగర్ లో ఓటమి చెంది రెండో స్థానానికి పరిమితమైనా.. బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా పడ్డ ఓట్లలో ఆయనదే అత్యధిక "షేర్" కావడం విశేషం. బీజేపీ అభ్యర్థులందరికంటే కూడా ఆయనదే మెజారిటీ వాటా. గోషా మహల్ లో 61,854 ఓట్లతో రాజా సింగ్ గెలుపొందితే.. ఆయన కంటే కూడా బండి సంజయ్ కు అత్యధికంగా 66,009 ఓట్లు లభించాయి. అంబర్ పేట నుంచి పోటీచేసిన కిషన్ రెడ్డికి 60,542 ఓట్లు పడ్డాయి.
కల్వకుర్తిలో ఆచారికి 59,445, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ కు 47,444, ముథోల్ లో రమాదేవికి 40,602, కార్వాన్ లో అమర్ సింగ్ కు 35,709, ఖైరతాబాద్ లో చింతల రామచంద్రారెడ్డికి 34,666, ముషీరాబాద్ లో లక్ష్మణ్ కు 30,813, మల్కాజిగిరిలో రాంచందర్ రావుకు 22,932 ఓట్లు దక్కాయి.

ఒకానొక దశలో రాజీనామా..! పార్టీ నేతలే కారణమా?
బీజేపీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా కార్యకర్తల్లో భరోసా నింపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇసుక లారీలతో దళితులను చంపిన నేరెళ్ల ఘటనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ తన శక్తినంతా ధారపోశారు. బాధితులకు అండగా నిలిచారు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వం అతడి శ్రమను గుర్తించలేదనే వాదనలున్నాయి. పైగా నేరెళ్ల క్రెడిటంతా బండి సంజయ్ కు దక్కుతుందనే కారణంతో అగ్రనేతలంతా దూరంగా ఉన్నారట. అదలావుంటే కాంగ్రెస్ నేతలు ఐకమత్యంతో ఉండి ఆ ఘటన క్రెడిట్ ఆ పార్టీ ఖాతాలో జమచేశారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బండి సంజయ్.. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. అలాంటిది ఆయనను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోదనే ఆరోపణలున్నాయి. పార్టీ నేతలపై విసుగు చెందారో ఏమో గానీ ఒకానొక దశలో బండి సంజయ్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బండి సంజయ్ లాంటి యువనాయకుడు పార్టీని వీడితే కష్టమే అనే చర్చ సాగింది. ఆ నేపథ్యంలో జాతీయ స్థాయి నాయకుల చొరవతో చివరకు బండి సంజయ్ తన రాజీనామా ఉపసంహరించుకున్నారు.

కరీంనగర్ బీజేపీకి కేరాఫ్.. ఓట్లతో తెలిసొచ్చిన బండి సత్తా
కరీంనగర్ బీజేపీ అంటే బండి సంజయ్.. బండి సంజయ్ అంటే కరీంనగర్ బీజేపీ అనే రీతిలో ఆయన కష్టపడ్డారు. పార్టీనే నమ్ముకుని పార్టీ కోసమే పనిచేస్తూ కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు. అయితే బండి సంజయ్ ఒక శక్తిగా ఎదుగుతున్నారనే విషయం ఆ పార్టీ రాష్ట్ర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదనలున్నాయి. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సంజయ్.. బీజేపీకి చేసిన సేవలు అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద నాయకుడు ఓడిపోయినా ఎవరూ కన్నీటి చుక్క రాల్చలేదు. ఆయన ఓటమి చెందిన క్షణంలో కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారంటే ఆయన క్రెడిబిలిటీ ఏంటో అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ అగ్రనేతలను తోసిరాజని ఆయనకున్న పేరు ఏమిటో, ఫేమ్ ఏమిటో ఓట్లతో తెలిసొచ్చింది. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే బలమైన కాంక్షతో రగులుతున్న బండి సంజయ్ ను ఇకనైనా పార్టీ నేతలు గుర్తిస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications