హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం-భాగ్యనగర్ ఉత్సవ సమితి సంచలన డిమాండ్-అవసరమైతే రాష్ట్ర బంద్‌?

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. తెలంగాణ కేబినెట్‌ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు.తమిళనాడులో జల్లికట్టు, కేరళలో శబరిమల మాదిరిగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.గురువారం(సెప్టెంబర్ 16) 10గం. నుంచి 11 గంటల వరకు కాషాయ, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపడుతామన్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు రెడీ అవుతున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రతిష్టంభనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. హైదరాబాద్‌లో 2,3లక్షల విగ్రహాలున్నాయని... వాటన్నింటినీ ఎక్కడ నిమజ్జనం చేయాలని ప్రశ్నించారు.

bhagyanagar utsav samiti demands ordinance for ganesh immersion in hussain sagar

ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.హుస్సేన్ సాగర్‌లో ఈ ఒక్క ఏడాది వరకు పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా... హైకోర్టు దాన్ని తిరస్కరించింది.జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.'తనకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలే పెట్టాలని వినాయకుడు కోరుకోలేదు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లోనూ ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్‌ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కాలుష్యకాసారంగా తయారైంది.' అని హైకోర్టు మండిపడింది.

వినాయక చవితికి ముందే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దని తీర్పునిస్తే.. అందుకు తగినట్లు ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదని నిలదీసింది. తీరా ఇప్పుడొచ్చి సమయం లేదని.. కరోనా ఉందని,భక్తుల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరడం సబబు కాదని పేర్కొంది. గణేశ్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని యధావిథిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఉద్రిక్తత :

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక అంజయ్యనగర్ బస్తీలో రెండు వేర్వేరు గణేశ్ విగ్రహాలకు చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినట్లు తెలుస్తోంది.

ఊరేగింపు సందర్భంగా ముందు వెళ్తున్న విగ్రహం వారికి,వెనక వస్తున్న మరో విగ్రహం వారికి మధ్య మొదట వాగ్వాదం జరిగింది. వెనకాల వస్తున్నవారు ముందు వెళ్తున్నవారిని పక్కకు తప్పుకోవాలని అన్నారు. ముందు వెళ్తున్నవారు ఎలా పక్కకు తప్పుకుంటారని వారు ప్రశ్నించడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి కర్రలతో కొట్టుకునేదాకా వెళ్లింది.దీంతో అప్పటిదాకా సంబరంగా సాగిన ఊరేగింపు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.బాధ్యులపై కేసు నమోదు చేశారు. స్థానిక చెరువు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ఊరేగింపు చేయాలని... ఎవరూ ఘర్షణలకు దిగవద్దని పోలీసులు కోరతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+