పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ... తెలంగాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణాకే తలమానికంగా నిలిచి, వివిధ రంగాల్లో కృషి చేసిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ఈ రోజు తెలంగాణా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు .సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్వర్గీయ పీవీ నరసింహారావు గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇస్తే సముచితంగా ఉంటుందని సభలో తీర్మానం ప్రవేశపెట్టారు .వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆయనకు భారత రత్న ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు . ఇటీవల పీవీ శతజయంతి వేడుకలను నిర్వహించటానికి ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిసిన విషయమే .

పీవీ గొప్పతనాన్ని కీర్తించిన సీఎం కేసీఆర్
భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన గొప్ప సంస్కర్తగా, మహా మనీషిగా పీవీ నరసింహారావు కు మంచి పేరు ఉందన్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. అపార రాజనీతిజ్ఞుడు అయిన పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడైన, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు . భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశం సుసంపన్నంగా మారడానికి బాటలు వేసిన పీవీ నరసింహారావు ఘన చరిత్రను ఆయన కీర్తించారు. పీవీ నరసింహారావు శతజయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం అంటూ ప్రస్తావించారు.

పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్న తెలంగాణా సర్కార్
తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు తాను ప్రవేశపెట్టిన సరళీకృత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చేశారని పేర్కొన్నారు. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన పీవీ నరసింహారావు ఘనుడు అంటూ సీఎం కేసీఆర్ కొనియాడారు అందుకే పీవీ మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్నదని సీఎం కేసీఆర్ కొనియాడారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు
పివి దేశానికి చేసిన సేవలను ప్రజలు అందరూ స్మరించుకునే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక పీవీకి భారతరత్న తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, దేశ ప్రధానిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా పి.వి.నరసింహారావు దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు.
Recommended Video

కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
పీవీ నరసింహారావు భారతరత్న పురస్కారం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, హైదరాబాదులో పివి నెలకొల్పిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ తొలి బిడ్డ గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో విస్తృతంగా చర్చించారు .












Click it and Unblock the Notifications