తెలంగాణా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయం .. వికారాబాద్ జిల్లాలో కాకులు,కోళ్ళు మృతి
తెలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ భయం ఇంకా పోలేదు . ఎక్కడ ఏ పక్షి చనిపోయినా బర్డ్ ఫ్లూ నా అన్న అనుమానం తెలుగు రాష్ట్రాల ప్రజలను వేధిస్తుంది . బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని వికారా బాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది .


వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో బర్డ్ ఫ్లూ కలకలం
అసలే కరోనా వైరస్, కరోనా కొత్త స్ట్రెయిన్ లతో భయపడుతున్న తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది . బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే కేరళ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ,హర్యానా, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు ప్రభావితం అయ్యాయి . ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలో
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో రెండు మూడు రోజుల నుండి కాకులు, కోళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ళను, పక్షులను పరిశీలించిన అధికారులు, వాటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.

వరుసగా కోళ్ళు, కాకులు మృతి .. ఆందోళనలో గ్రామస్తులు
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని, బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కానీ వికారాబాద్ జిల్లాలో వరుసగా కాకులు ,కోళ్లు చని పోతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ ఏమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దోర్నాల్ గ్రామంలో మృతి చెందిన పక్షుల ను పరిశీలించిన అధికారులు నమూనాలు కూడా సేకరించినట్లు గా తెలుస్తుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే భారీగా తగ్గిన చికెన్ కొనుగోళ్ళు .. పౌల్ట్రీ నిర్వాహకుల ఆందోళన
ఎక్ప్పుడైతే కోళ్ళు, కాకులు మృతి చెందుతున్నాయి అన్న వార్త ప్రచారం అయ్యిందో వికారాబాద్ జిల్లాలో చికెన్ కొనుగోళ్ళు గణనీయంగా పడిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు . ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో కూడా చాలా మంది బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినటం మానేశారు . ఇక చికెన్ ధరలు కూడా విపరీతంగా తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేగటం పౌల్ట్రీ నిర్వాహకులకు కూడా ఆందోళన కలిగించే అంశం . దీంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తినకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా అధికారులను అలెర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి మరీ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది .