కేంద్రం అన్ని పరిశీలిస్తుంది... ఆర్టీసీపై సూచనలు కూడ చేసింది...!
ఆర్టీసీని ప్రవైట్ పరం చేస్తే...చూస్తూ ఊరుకోమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం ఆర్టీసీ సమస్యను చాలా క్షుణ్ణంగా పరీశీలిస్తుందని చెప్పిన ఆయన, ఇందుకు సంబంధించి కేంద్రం ద్వార రాష్ట్రానికి సూచనలు కూడ వెళ్లాయని అన్నారు. గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేందుకు నిర్ణయం తీసుకుంటే....బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.

ఢిల్లీలో పర్యటిస్తున్న లక్ష్మణ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలతో పాటు, పలువురు మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రి సీతారామన్లను కలిసి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను వివరించినట్టు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని కూడ తీసుకువెళ్లినట్టు వివరించారు. ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రవైటీకరణ నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం
రాష్ట్రంలో విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ.. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం విస్మరించి, నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యా వ్యవస్థతో పాటు ఆర్టీసీని కూడ ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని అన్నారు. అయితే ప్రభుత్వ విధానాలను పూర్తిగా అడ్డుకుంటామని లక్ష్మణ్ హెచ్చరించారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ
ఇక ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలంటే... కేంద్రం ఆమోదం తప్పనిసరి అని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కేంద్రం అమోదం లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు రవాణా సంస్థ చట్టంలోని 39 సెక్షన్ ప్రకారం కేంద్రం అమోదం ఉంటేనే... విలీనం గాని, ప్రైవేటీకరణకు గాని చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ నష్టాలను తాము భరించబోమని కూడ ఆయన స్పష్టం చేశారు.

పరిష్కరించని బీజేపీ
మొత్తం మీద ఆర్టీసీ సమ్మెను తన భుజాన వేసుకుని నడిపిన బీజేపీ సమ్మెకు పరిష్కారం చూపించడంతో పాటు సీఎం కేసీఆర్పై ఒత్తిడి తేవడంలో మాత్రం వైఫల్యం చెందిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 52 రోజుల సమ్మెలో ఆందోళనలు చేస్తూనే.. రాజ్యంగపరంగా కూడ పావులు కదిపారు. మరోవైపు ఢిల్లీ వెళ్లి పార్టీ నేతలతో పాటు కేంద్ర మంత్రులతో సైతం మంతనాలు జరిపారు. కాని ఆర్టీసీ కార్మికుల సమస్య మాత్రం పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బూచితో ఏదో అవుతుందని భావించిన కార్మికులకు సైతం చుక్కెదురైంది. మొత్తం మీద ప్రభుత్వం పరిణామాలతో కార్మికులే స్వయంగా ముందుకు వచ్చి సమ్మెను విరమించే విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు. అయినా... బీజేపీ మాత్రం ఇంకా ఏదో చేస్తామని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications