ఓసీల ఓట్లు ఓసీలకే.. బీసీల ఓట్లు బీసీలకే.. టీఆర్ఎస్లో గిట్ల కూడా ఉంటదా?
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ అనతికాలంలోనే రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. గులాబీ జెండా తప్ప మరో ఎజెండా లేకుండా చేయాలనే పార్టీ అధినేత ఆకాంక్షలకు అనుగుణంగా రోజురోజుకీ బలపడుతోంది. కులాలకు అతీతంగా గులాబీ వనం వికసిస్తోందనే పార్టీ పెద్దలు.. ఏ పార్టీ నుంచి నేతలు వలస వచ్చినా అక్కున చేర్చుకుంటున్నారు.
ఇప్పటికే గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ, కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నట్లే కనిపిస్తోంది. అలాంటి జోష్ మీదున్న గులాబీ గూటిలో కుల జాఢ్యం రాజ్యమేలుతుందనడానికి నిదర్శనంగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో సజీవ సాక్ష్యంగా నిలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కులాంతరలా..?
గులాబీ వనంలో కులంతరాలకు తావు లేదని.. పార్టీలో అందరూ ఒక్కటే అనేది గులాబీ పెద్దలు తరచుగా చెప్పే మాట. అంతేకాదు ఏ ఎన్నికల్లోనైనా టికెట్ ఎవరికి ఇచ్చామనేది ముఖ్యం కాదని, గెలుపు మాత్రమే టీఆర్ఎస్ లక్ష్యమని చెబుతుంటారు. టికెట్ ఎవరికి దక్కినా.. క్యాడర్ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలనేది నొక్కి వక్కాణిస్తారు. క్రమశిక్షణకు టీఆర్ఎస్ పార్టీ మారుపేరని.. పార్టీశ్రేణుల మధ్య ఎలాంటి విబేధాలు ఉండవని.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ గా అభివర్ణిస్తుంటారు.

వీడియో వైరల్
టీఆర్ఎస్ లో క్రమశిక్షణ మాట ఏమో గానీ, కుల జాఢ్యం పెచ్చుమీరిపోయిందని ఉటంకిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బొమ్మల రామారం సర్పంచ్ మల్లారెడ్డి.. అక్కడి ఎంపీపీ బాల నర్సింహ యాదవ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణగా పేర్కొంటున్న ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అన్న.. రేపు నామినేషన్ కార్యక్రమం ఉంది, మనోళ్లు ఎంతమంది వస్తారని బాల నర్సింహ యాదవ్ అడిగితే.. మాకేం సంబంధం మేము ఓసీలం, మీరు బీసీలు అంటూ మల్లారెడ్డి మాట్లాడిన తీరు వివాదస్పదంగా మారుతోందట. అదేందన్నా.. ఒకటే పార్టీలో ఉన్నాం గదా, ఇలా మాట్లాడుతున్నారేంటి అని నర్సింహ ప్రశ్నిస్తే.. అదంతా కాదు మేము ఓసీలకు వేసుకుంటాం మీరు బీసీలకు వేసుకోండని సమాధానం ఇవ్వడం గమనార్హం.

మేం ఓసీలం, మీరు బీసీలు
నామినేషన్ కార్యక్రమం ఉందని సార్ మీకు చెప్పమన్నారు.. అందుకే నేను మీకు చెబుతున్నానంటూ నర్సింహ సర్దిచెప్పే ధోరణిలో మాట్లాడితే.. మల్లారెడ్డి ఏ మాత్రం తగ్గలేదు. మేం ఓసీలం, మీరు బీసీలు, మాకేం సంబంధం.. నేను ఇలా అంటున్నానని సారుకు చెప్పు.. అర్థమైందా అంటూ ఫోన్ పెట్టేశారు. దాంతో నర్సింహకు ఏమి మాట్లాడాలో తెలియక సరే అన్నా అంటూ ఆ సంభాషణను అక్కడితో ముగించారు.

టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది?
ఓసీ, బీసీ నేతల మధ్య జరిగిన ఈ సంభాషణ.. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ ఏవిధంగా ఉందనేదానికి అద్దం పడుతుందనే వాదనలు లేకపోలేదు. పార్టీ జెండా ఒక్కటే అయినా.. ఇలా కులాల పేరిట నేతల మధ్య విభేదాలు పొడసూపడం చర్చానీయాంశంగా మారింది.
ఇక ఆ వీడియోలో ఇద్దరు నేతల సంభాషణ అయిపోయాక.. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో కులజాఢ్యాన్ని ప్రశ్నించారు. రాజకీయంగా, సామాజికంగా దళిత బహుజనులను అణచివేస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న రాజకీయ అరాచకాలకు ఇది పరాకాష్ట అంటూ అభివర్ణించారు. దేశ జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న రెడ్లు.. 91 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కాలనుకోవడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఉంటుందా అని ప్రశ్నించారు. మొత్తానికి ఓసీల ఓట్లు ఓసీలకే.. బీసీల ఓట్లు బీసీలకే అన్న చందంగా ఉన్న ఆ వీడియో టీఆర్ఎస్ పెద్దల వరకు చేరిందా. పార్టీలో అంతర్గత క్రమశిక్షణ కోసం పరితపించే గులాబీ హైకమాండ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications