పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి.. చంద్రబాబు నాయుడు ఆకాంక్ష
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించారు.
కోలుకోవాలని ఆకాంక్ష
వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పవన్ ఆరోగ్యం వెంటనే కుదుటపడాలని ఆకాంక్షించారు. ఇటీవల సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్కు తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన ఫామ్హౌస్లో చికిత్స పొందుతున్నారు. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణుడు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్ తన అభిమానులకు తెలియజేశారు.
బిజీ బిజీ
ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్కు చేరుకున్న తర్వాత, 4వ తేదీ 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అప్పటి నుంచి నలతగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన ఫలితం నెగిటివ్ వచ్చింది. వ్యవసాయక్షేత్రంలో క్వారంటైన్లో ఉన్నారు. అప్పటి నుంచి కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. రెండు రోజుల కింద మరోసారి కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
అపోలో బృందం కూడా
అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ని పరీక్షించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు.