అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపుకొన్న సీఎం: నెట్టింట్లో వైఎస్ జగన్పై ప్రశంసల జల్లు (వీడియో)
Recommended Video
హైదరాబాద్: అత్యసర వైద్య సేవల కోసం వినియోగించే వాహనం అంబులెన్స్. నడిరోడ్డు మీద ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్కు దారి ఇచ్చి, అది సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడానికి ఎవరు సహకరించినా- ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్లవుతారు. ఇందులో సందేహాలు అక్కర్లేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిచేశారు. అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇచ్చారు. తన కారును, కాన్వాయ్ను పది నిమిషాల పాటు నిలిపి వేశారు. ఆ అంబులెన్స్ సకాలంలో తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆయన సహకరించారు.
రాజ్భవన్ టు ఖైరతాబాద్ జంక్షన్
ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు రాజ్భవన్లో ఇచ్చిన ఇఫ్తార్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లడానికి వైఎస్ జగన్ తన కాన్వాయ్తో పాటు రాజ్భవన్ నుంచి బయటికి వచ్చారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ కుయ్, కుయ్ మని శబ్దం చేసుకుంటూ రాజ్భవన్ రోడ్డు మీదుగా ఖైరతాబాద్ జంక్షన్ వైపు వెళ్తూ కనిపించింది. వైఎస్ జగన్ కాన్వాయ్ రాజ్భవన్ నుంచి బయటికి వస్తుండటంతో ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో భాగంగా అంబులెన్స్ను నిలిపివేశారు పోలీసులు.
అంబులెన్స్ వెళ్లిన తరువాతే..
దీన్ని గమనించిన వైఎస్ జగన్.. మొదటగా అంబులెన్స్ను పంపించాలని సూచించారు. దీనికోసం తన కాన్వాయ్ను నిలిపివేశారు. అంబులెన్స్ ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నళ్ల వద్ద చేరుకునేంత వరకూ రాజ్భవన్ ప్రధాన ద్వారం వద్దే నిలిచిపోయింది ఆయన కాన్వాయ్. అనంతరం అక్కడి నుంచి బయలుదేరింది. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ అది. 10కి పైగా వాహనాలు ఆ కాన్వాయ్లో ఉన్నాయి. అంబులెన్స్ కంటే ముందుగా- అలాంటి కాన్వాయ్కు బయలుదేరి వెళ్లడానికి అనుమతి ఇచ్చి ఉంటే.. ఆ తరువాతి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా బుర్రను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
వాహన ప్రవాహంలో చిక్కుకుని పోయేదే..!
రాజ్భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ జంక్షన్ వరకు సాధారణంగా వాహన ప్రవాహం అధిక. వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున ఈ మార్గంలో సాగుతుంటాయి. అలాంటి సమయంలో- ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ను ముందుకు పోనిచ్చి, ఆ తరువాత అంబులెన్స్కు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి భయానకంగా మారిపోయి ఉండొచ్చు. వాహన ప్రవాహంలో చిక్కుకుని కదలాడానికే ఇబ్బందులను ఎదుర్కొని రావాల్సి వచ్చుండేదా ప్రాణ ప్రదాయినికి. ముఖ్యమంత్రి కాన్వాయ్ బయలుదేరి వెళ్లిన కొన్ని నిమిషాల వరకు గానీ సాధారణ వాహనాలకు అనుమతి ఇవ్వరు.
అధికార దర్పాన్ని పక్కన పెట్టి..
అలాంటిది వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. తాను ముఖ్యమంత్రిననే దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు. ఓ నిఖార్సయిన నాయకుడిలా ఆలోచించారు. అంబులెన్స్ శబ్దం వినిపించగానే.. రాజ్భవన్ ప్రధాన ద్వారం వద్దే తన కారును, కాన్వాయ్నీ ఆపేశారు. ఆ అంబులెన్స్ వెళ్లిన తరువాత ఆయన అక్కడి నుంచి కదిలారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
నాయకుడనే వాడు ఇలాగే ఉండాలంటోన్న నెటిజనులు..
వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకరి ప్రాణాన్ని కాపాడి ఉండొచ్చంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. నాయకుడనే వాడు ప్రజల కోసం పనిచేయాలే తప్ప.. తన కోసం, తాను చెప్పినట్టుగా జనం విని, ఆచరించి తీరాలనేలా ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. అంబులెన్స్లకు, వైఎస్ జగన్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని పాత విషయాలను గుర్తు చేస్తున్నారు.
అంబులెన్స్కు, వైఎస్ కుటుంబానికీ అవినాభావం సంబంధం..
జీవన ప్రదాయినిగా పేరు తెచ్చుకున్న 108 అంబులెన్స్లను మొట్టమొదటి సారిగా అమలు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 108 అంబులెన్స్ అంటే వైఎస్ అనేలా పేరు తెచ్చుకున్నారాయన. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ వ్యవస్థను ప్రశంసించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్ర సందర్భంగా ఓ అంబులెన్స్కు దారి ఇచ్చిన సంఘటన గుర్తుండే ఉంటుంది.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా..
పాదయాత్ర సందర్భంగా నడి బజారులో వైఎస్ జగన్ బస్సుపై నిల్చుని ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ అంబులెన్స్ శబ్దం చేసుకుంటూ అటుగా వచ్చింది. దాన్ని చూసిన జగన్ .. తన ప్రసంగాన్ని ఆపేశారు. అంబులెన్స్కు దారి ఇవ్వాలని ప్రజలను సూచించారు. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేత. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఓ అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ను ఆపేయడం గొప్ప విషయమని అంటున్నారు నెటిజన్లు.