సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం
సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని సమాచారం.
Recommended Video


అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 8 ఫైర్ ఇంజన్ ల తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో 11 మంది కార్మికులు మృతిచెందగా వారి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు అందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బోయిగూడ టింబర్ డిపో లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతి చెందిన వలస కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
అగ్ని ప్రమాద ఘటనలో బీహార్ కు చెందిన కార్మికులు మరణించడం పట్ల ఆయన తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సి ఎస్ సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సంఘటనా స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇక అగ్ని ప్రమాద ఘటనలో గోదాంలో మృతిచెందిన వారి వివరాలు దినేష్, సికిందర్, బిట్టు, చింటూ, దామోదర్, సికిందర్, రాజేష్, రాజు,సత్యేందర్, దీపక్, పంకజ్ లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే అగ్నిప్రమాద ఘటన తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాద ఘటన లో 11 మంది సజీవదహనం కావడం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మృతి చెందిన బీహారీల మృతదేహాలను స్వస్థలాలకు తరలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications