రేపు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ... గ్రేటర్ టార్గెట్పై దిశా నిర్దేశం చేయనున్న గులాబీ దళపతి..
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి,గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 17) మధ్యాహ్నం 2గంటలకు టీఆర్ఎస్ పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఊపు మీదున్న బీజేపీ... జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా నేడే... బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలపై ఆరోపణలు..
గత 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 మార్క్ వద్దే ఆగిపోయిన టీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా సెంచరీ దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో... ఉన్న కొద్దిపాటి సమయాన్ని పూర్తిగా వినియోగించుకునేలా కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారు. గ్రేటర్ పరిధిని మొత్తం నాలుగు జోన్లుగా విభజించి మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు 35 మంది ఎమ్మెల్సీలను ప్రచార బరిలో మోహరిస్తున్నారు.
గ్రేటర్లో ప్రచారం చేయాల్సిన సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలపై బుధవారం నాటి సమావేశంలో కేసీఆర్ నేతలకు వివరించనున్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని నేతలకు సూచించనున్నారు. రేపటి సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ గ్రేటర్ మేనిఫెస్టోను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే గ్రేటర్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా రేపే విడుదల చేసే అవకాశం ఉంది.
Recommended Video
ఎన్నికల సంగ్రామంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో 104 స్థానాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. మా అభివృద్దే మా గెలుపుకు నాంది అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ది పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. కరోనా,వరదలు వంటి సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు అండగా నిలిచిందన్నారు. దుబ్బాక ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీపై ఉండదని పేర్కొన్నారు.