తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత: 20 వరకు ఇదే పరిస్థితి, అత్యల్ప ఉష్ణోగ్రత ఇక్కడే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకూ మరింతగా పెరుగుతోంది. తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.
మరోవైపు, తెలంగాణలో చలి తీవ్రత మరో నాలుగైదు రోజులపాటు మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. పశ్చిమ అలజడి ఒకటి ఉత్తర భారతదేశంపైన కదులుతూ వెళ్లడం వల్ల దాని ప్రభావం ఉందని చెప్పారు.
దీని కారణంగానే గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో పలు చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మంచు, పొగమంచు ప్రభావం మరో 4-5 రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది.
జనవరి 20 వరకు చలితీవ్రత తగ్గే అవకాశం లేదని నాగరత్న చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురంభీం జిల్లా సిర్పూర్(యు)లో 5.9, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో 7.9, అబ్దుల్లాపూర్ మెట్లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధి కలిగినవారు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటికి రావొద్దని సూచిస్తున్నారు.