ఈసారి లీడర్లు కాదు, గవర్నర్లు టార్గెట్.. హన్మంతన్న ఏమన్నారంటే..!
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. అపొజిషన్ నేతలైనా, సొంతగూటి నేతలైనా.. సందర్భం వస్తే ఎవరని చూడరు. ఏకిపారేస్తూనే ఉంటారు. కొందరు వీహెచ్ను భోళాశంకరుడిగా అభివర్ణించినా.. మరికొందరు నోటిదురుసు ఎక్కువంటూ ఆరోపించినా.. ఆయన వైఖరి మాత్రం మారదు. ఆయన ఆయనలాగే ఉండాలనుకుంటారు. ఆ క్రమంలో ఆయన మాట్లాడిన తీరు మరోసారి చర్చానీయాంశమైంది. అపొజిషన్ నేతలను చెడుగుడు ఆడతారనే పేరున్న వీహెచ్.. ఈసారి గవర్నర్లను టార్గెట్ చేశారు. తమను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్న నెక్లెస్ రోడ్డులోని జల విహార్లో దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. అది రాజకీయ వేదిక కానప్పటికీ ఆయన అలా మాట్లాడటం హాట్ టాపికైంది.

తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు ముందు గవర్నర్గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత గవర్నర్.. పాత గవర్నర్లా వ్యవహరించొద్దని సూచించారు. పనిలో పనిగా అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించిన దత్తన్నకు కూడా వీహెచ్ సుతిమెత్తగా చురకలు అంటించారు. ఫ్లెక్సీలో కాంగ్రెస్ నేతల ఫోటోలు ఎక్కడా కనబడటం లేదని ప్రశ్నించారు. అందరూ కలిసి చివరకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications