కాంగ్రెస్ పెద్దలకు షాక్: మోడీ ప్యాకేజీపై కోమటిరెడ్డి ప్రశంస, ప్రధానికి లేఖ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని
ప్రకటించారంటూ ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కరోనా కట్టడికి సమర్థ చర్యలేగాక..
కరోనావైరస్ కట్టడిని సమర్థంగా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టడమే కాకుండా ఆయా దేశాలకు వైద్య సహకారం అందిస్తుండటం ఆహ్వానించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు, చేతి వృత్తిదారులకు సైతం నిధులు కేటాయించాలని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

వారిని ఆదుకోవాలంటూ..
లాక్ డౌన్ కారణంగా దేశంలో ఉన్న చేనేత, ఇతర చేతి వృత్తులవారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన లేఖలో తెలిపారు. 2019 లెక్కల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించాలన్నారు.చేనేత వృత్తిని నమ్ముకున్నవారిలో అధికశాతం పేదలే ఉన్నారన్నారు.
Recommended Video

కాంగ్రెస్ పెద్దలు విమర్శించగా.. కోమటిరెడ్డి ధన్యవాదాలు..
ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే ముడి సరుకుల కొనుగోలు ద్వారా ఆయా వృత్తులు తిరిగి గాడిలో పడతాయని కోమటిరెడ్డి తెలిపారు. నెలకు రూ. 3వేల చొప్పున మూడు నెలలపాటు ఆర్థిక సాయం, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందించాలని ప్రధానిని కోరారు. దేశంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 23 కోట్ల కుటుంబాలకు కట్టుకునే బట్టలు అందజేయాలని, వీటిని తయారు చేసే బాధ్యతను చేనేత, చేతి వృత్తిదారులకు అప్పగించాలని కోమటిరెడ్డి ప్రధానిని కోరారు. కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, చిదంబరం, రాహుల్ గాంధీ లాంటి వారు కేంద్ర ప్యాకేజీపై విమర్శలు గుప్పిస్తుంటే కోమటిరెడ్డి మాత్రం ఆయనకు ధన్యవాదాలు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన ప్రధానిని కలిసి విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications