వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ నిరసన .. గవర్నర్ వద్దకు వెళ్ళకుండానే అరెస్ట్ లు .. ఫైర్ అయిన ఉత్తమ్
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రాజ్ భవన్ వద్ద ఆందోళనతోపాటు గవర్నర్ కు వినతిపత్రం అందజేయాలని ఏఐసిసి ఇచ్చిన పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్ భవన్ కు బయల్దేరారు . గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసేందుకు దిల్ కుషా గెస్ట్ హౌస్ నుండి వారు రాజ్ భవన్ కు బయల్దేరారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

వ్యవసాయ బిల్లులపై దిల్ కుషా గెస్ట్ హౌస్ ముందు కాంగ్రెస్ నాయకుల నిరసన
రాజ్ భవన్ కు వెళ్లడానికి ముందు నూతన వ్యవసాయ బిల్లులపై నిరసనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్ద తమ నిరసన తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ పై, తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. వ్యవసాయ బిల్లులను బలవంతంగా ఆమోదింపజేసుకుందని బీజేపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల యత్నం .. పోలీసుల అరెస్ట్
ఆ తర్వాత రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లి గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ పై , పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి ఇన్చార్జిగా నూతనంగా నియమితమైన మాణిక్కం ఠాగూర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్ ,సంపత్ కుమార్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video

ఫైర్ అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిల్ కుషా గేటు బయట బైఠాయించి ఆందోళనకు ప్రయత్నించిన ఎమ్మెల్యే సీతక్క తో పాటుగా,కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళనలో భాగంగా టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలు చెప్పటానికి గవర్నర్ వద్దకు వెళ్తామంటే కేసీఆర్ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుందని మండిపడ్డారు. బిజెపి భాగస్వామ్య పార్టీలు కొన్ని రైతు వ్యతిరేక బిల్లులను వద్దన్నా ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు.
మోడీతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని మండిపాటు
ఈ బిల్లులతో రైతులకు రక్షణ ,గిట్టుబాటు ధర హామీ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కార్పొరేట్ వ్యవస్థకు మాత్రమే స్వేచ్ఛను ఇచ్చే విధంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు కెసిఆర్ మద్దతు ఇచ్చారని ఫైర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మోడీతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ దని విమర్శించిన ఉత్తమ్ రైతుల రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications