రాష్ట్రపతికి సొంత అభ్యర్థిని నిలుపు.. లేదంటే మోడీతో దోస్తానే: రేవంత్ రెడ్డి
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చిందో లేదో.. అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ మాటను కేసీఆర్ తూ.చ తప్పకుండా వింటారని చెప్పారు. కేసీఆర్ సొంత అభ్యర్థిని పెట్టి రాష్ట్రపతి ఎన్నికలకు వెళితేనే మోడీని వ్యతిరేకించినట్టు అన్నారు. కానీ అలా చేయరని విమర్శించారు.
ఇటు రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దర్బార్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగానే ఉంటుందని చెప్పారు. మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని మండిపడ్డారు. సెక్షన్ 8 ప్రకారం జంట నగరాలలో గవర్నర్కు సర్వాధికారాలు ఉన్నాయని గుర్తుచేశారు. అవసరమైతే పరిపాలనను గవర్నర్ చేతిలోకి తీసుకోవచ్చని అన్నారు.
టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి రాష్ట్రంలో పాలననే కాకుండా.. అత్యాచారాలు కూడా పొత్తుల్లోనే చేస్తున్నట్లు ఉందని విమర్శించారు. బాలిక రేప్ కేసులో పాత్రధారి అయిన వక్ఫ్ బోర్డు చైర్మన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని.. ఆ రెండు పార్టీల చర్యలను బట్టి అర్థం అవుతుందని చెప్పారు.
ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు తొలగించింది కేసీఆరే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి, జయంతికి పూలదండలు వేస్తున్నారని అన్నారు. ఇవన్నీ జనానికి గుర్తు లేదా అని అడిగారు. కేసీఆర్ గతంలో వ్యవహరించిన తీరును ఎన్టీఆర్ అభిమానులు మర్చిపోతారా? అని నిలదీశారు. ఇప్పుడు కేసీఆర్కు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకువచ్చారో? అని ప్రశ్నించారు. ప్రజలు ఇక కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదన్నారు.