coronavirus: సా.6 దాటాకా కిరణా షాపులు క్లోజ్, మెడికల్ షాపు, ఆస్పత్రికే పర్మిషన్, లాక్డౌన్ జీవో..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జనం చూపిన నిబద్ధత.. సోమవారం చూపించలేదు. రహదారులపై ఇబ్బడి ముబ్బడిగా రావడంతో ప్రధాని మోడీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధలనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సాయంత్రం ఆరు అయితే చాలు కిరాణా షాపులు, గ్రోసరి స్టోర్స్ విధిగా మూసివేయాలని వెల్లడించింది.
సాయంత్రం 6 వరకు..
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కిరణా షాపులు తెరిచి ఉంటాయని.. తర్వాత మూసివేయాలని జీవోలో స్పష్టంచేసింది. సాయంత్రం 6 తర్వాత ఆస్పత్రి, మెడికల్ షాపు మాత్రమే తెరచి ఉంటాయని పేర్కొన్నది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ మెడికల్ కేర్కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. అత్యవసరంగా వెళ్లేవారు తగిన కారణం చూపాలని... బైక్పై ఒకరు, కారులో ఇద్దరికీ మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపింది.
3 కి.మీ పరిధిలోనే..
లాక్డౌన్ నేపథ్యంలో తమ ఇంటి సమీపంలోనే కిరాణా షాపుల్లో వస్తువుల కొనుగోలు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. 3 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లొద్దని తేల్చిచెప్పింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆదేశాల అమలు కోసం చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటుచేసింది. ఆదివారం ఒక్కరోజు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జనాలు శనివారం రోజే సరుకులు కొనుగోలు చేశారు. అయితే ఆదివారం నుంచి 31వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో సోమవారం రహదారులపై జనాలు చేరుకున్నారు. తమకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేశారు.
చుక్కలంటిన ధరలు
కిరాణా సరుకులు యథాతథంగా ఉండగా.. కూరగాయాల ధరలు మాత్రం చుక్కలను అంటుతున్నాయి. కేజీ టమాట రూ.100 వరకు పలికింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని విక్రేతలు క్యాష్ చేసుకోవడంతో ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే నిత్యావసర వస్తువుల ధరలపై కమిటీ ఏర్పాటు చేశారు. నిర్దేశించిన ధరలకు వస్తువులను విక్రయించాలని.. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించే అవకాశం ఉంది.