షి సేఫ్ నైట్ వాక్: మహిళల భద్రతపై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్: ఏం చెబుతున్నారంటే.. !
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యోదంతంలో నలుగురు దోషులను ఎన్కౌంటర్ చేసిన ఉదంతంలో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తోన్న ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, చిన్నపిల్లలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఈ తరహా ఈవెంట్ ఇదివరకు ఎవ్వరూ చేపట్టలేదనే చెప్పుకోవచ్చు.
షి సేఫ్ నైట్ వాక్ పేరుతో..
షి సేఫ్ నైట్ వాక్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అధికారులు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఓ విభాగం ఇది. మహిళలు, చిన్నపిల్లల భద్రత కోసం ఈ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. షి సేఫ్ నైట్ వాక్ ఈవెంట్లో హైదరాబాద్కు చెందిన పలువురు ప్రముఖలు భాగస్వామ్యులు కానున్నారు.
Recommended Video
గచ్చిబౌలి స్టేడియంలో..
హైదరాబాద్ శివార్లలోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం సాయంత్రం 8 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. కొన్ని గంటలపాటు వారు నడకను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నపిల్లలకు అండగా తాము ఉన్నామనే భరోసాను ఇవ్వనున్నారు. రాత్రివేళల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే వాతావరణాన్ని, పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.
పాల్గొనబోయే ప్రముఖులు వీరే..
షి సేఫ్ నైట్ వాక్ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారణి, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని, సీనియర్ ఐపీఎస్ అధికారిణి, షి టీమ్స్ ఇన్ఛార్జి స్వాతి లక్రా, ప్రముఖ నటి ఈషా రెబ్బా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఐటీ హబ్లోనే ఎందుకంటే..
గచ్చిబౌలి ప్రాంతానికి ఐటీ హబ్గా పేరుంది. అక్కడే ఈ ఈవెంట్ను నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఐటీ సంస్థలు ఉన్నాయి. వందలాది మంది మహిళా సాఫ్ట్వేర్ నిపుణులు ఉద్యోగాలు చేస్తున్నారు. అర్ధరాత్రి పూట తమ విధులను ముగించుకోవడమో లేదా.. అదే సమయానికి కార్యాలయాలకు చేరుకోవడమో చేస్తుంటారు వారంతా. అలాంటి ఐటీ నిపుణులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీనికి శ్రీకారం చుట్టినట్లు సజ్జనార్ చెబుతున్నారు.