తెలుగు రాష్ట్రాలపై ఈడీ పంజా: జయభేరి అపార్ట్మెంట్స్..!!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. తన దాడుల తీవ్రతను పెంచింది. విస్తృతంగా సోదాలను చేపట్టింది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులకు శ్రీకారం చుట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ తెల్లవారు జామున దాడులు మొదలయ్యాయి. ఒక్కో ప్రాంతంలో 10 నుంచి 25 బృందాలు ఇందులో పాల్గొంటోన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం..
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన మద్య విధానంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణల మేరకు ఈ దాడులను చేపట్టింది ఈడీ. తొలుత సీబీఐ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు.
రాబిన్ డిస్టిల్లరీపై..
సీబీఐ తరువాత ఈడీ అధికారులు- ఢిల్లీ లిక్కర్ స్కాంలో జోక్యం చేసుకున్నారు. ఇవ్వాళ మరోసారి దాడులకు దిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్లల్లో ఏకకాలంలో ఈ దాడులకు దిగారు ఈడీ అధికారులు. హైదరాబాద్ నానక్రామ్ గూడలో గల రాబిన్ డిస్టిల్లరీ అండ్ బ్రేవరెజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తోన్నారు. డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నారు.
జయభేరి అపార్ట్మెంట్స్లో
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గంలో గల జయభేరి అపార్ట్మెంట్స్లో కూడా ఈడీ అధికారులు దాడులు సాగిస్తోన్నారు. రామచంద్రన్ పిళ్లైకి చెందిన కంపెనీలు, నివాసంలో సోదాలు చేస్తోన్నారు. రాబిన్ డిస్టిల్లరీ అండ్ బ్రేవరెజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. రామచంద్రన్ పిళ్లైకి చెందినదే. కాగా- అభిషేక్ రావు, జీ ప్రేమ్ సాగర్ నివాసాలపైనా దాడులు సాగుతున్నాయి. ఏపీలోని నెల్లూరులో ఆరు చోట్ల సోదాలను నిర్వహిస్తోన్నారు.
మనీష్ సిసోడియాపై..
ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ఢిల్లీలో విస్తృతంగా దాడులు నిర్వహించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగా ఇవ్వాళ ఏకకాలంలో 45 ప్రాంతాల్లో దాడులకు దిగింది. ఇదివరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ1గా ఆయన పేరును చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 120-బీ, 477-ఏ కింద కేసు నమోదు చేశారు. మద్యం వ్యాపారులకు రూ.30 కోట్ల మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు.