రాజకీయాల్లోకి రావొద్దని పీవీ చెప్పారు..కానీ, కేసీఆర్పై బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శలు
రాజకీయాల్లోకి రావొద్దు అని మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తనతో చెప్పారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ పీవీ వర్ధంతి కావడంతో ఆయన నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. పీవీతో తనకు ఉన్న పరిచయాన్ని అర్వింద్ గుర్తుచేశారు. తనను పాలిటిక్స్లోకి రావొద్దని స్పష్టంచేశారని తెలిపారు. పీవీ వర్దంతి వేళ అర్వింద్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పీవీ ఘాట్ను కూలకొడతామని ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే అనడం సరికాదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడకపోవడం శోచనీయమని తెలిపారు. కానీ పీవీ మీద దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కన్నా అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నయమని అభిప్రాయపడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం ఒకరిని జైల్లో పెట్టించారని ఎంఐఎం పార్టీపై కామెంట్స్ చేశారు.
తెలుగుజాతి ఖ్యాతీని ఇనుమడింపజేసిన పీవీకి భారతరత్న ఇవ్వాలని అర్వింద్ అభిప్రాయపడ్డారు. ఈ విషయం ఎక్కడ అంటే అక్కడ చెబుతామన్నారు. పీవీ నరసింహారావును చూసి భారతీయత నేర్చుకోవాలని కేసీఆర్కు హితవు పలికారు. బతికున్నప్పుడు విభేదించి.. వ్యతిరేకించిన వారు ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. కానీ ప్రజలకు ఏంటో తెలుసు అని చెప్పారు. చనిపోయిన వ్యక్తి గురించి గొప్పలు చెప్పుకొని క్యాష్ చేసుకోవడం ఏంటీ ప్రశ్నించారు. మరీ అప్పుడు పీవీ పేరును ఎందుకు ప్రస్తావించలేదు అని అడిగారు.
పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో అర్వింద్ తండ్రి డీ శ్రీనివాస్ సన్నిహితంగా ఉండేవారు. వారిద్దరూ ఒకే పార్టీలో ఉండి.. కలిసి మెలసి పనిచేశారు. ఆ సందర్భంలో తాను పీవీని కలిసిన సమయంలో చెప్పిన అంశాలను అర్వింద్ గుర్తుచేశారు. కానీ తాను యాదృచ్చికంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.