దిశ ఎన్కౌంటర్ నిందితుల విచారణ వాయిదా, సుప్రీంకోర్టులో ఉన్నందునే, గురువారం విచారణ..
దిశను లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత శుక్రవారం ఎన్కౌంటర్ జరగగా.. ఆ రోజు రాత్రి మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్, హైకోర్టులో కేసు నమోదవడంతో అంత్యక్రియలకు బ్రేక్ పడింది.

ఎన్హెచ్ఆర్సీ-హైకోర్టు విచారణ..
దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ విచారణ గత మూడురోజుల కొనసాగుతోంది. మరోవైపు సోమవారం హైకోర్టు ముందుకు విచారణ పిటిషన్ వచ్చింది. ఉదయం 10.30 గంటలకు విచారించే సమయంలో మరో పిటిషన్ ఉన్నందున మధ్యాహ్నం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో కూడా..
నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించనుంది. సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున.. సోమవారం విచారణ చేపట్టలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అక్కడ విచారణ పూర్తయ్యాక.. గురువారం పిటిషన్ విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

వాయిదాల పర్వం
నిందితుల ఎన్కౌంటర్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో.. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని స్పష్టంచేసింది. హైకోర్టు ఆదేశాలతో మహబూబ్ నగర్ అనాటమీలో ఉన్న మృతదేహాలను హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేకపోవడంతో మెడికల్ కాలేజీకి తరలించారు. ఇక్కడ 12 మృతదేహాలను భద్రపరచొచ్చు. కానీ మరో మూడురోజులు భద్రపరిచే వెసులుబాటు లేదు. దీంతో గాంధీకి తరలించాలని ఆదేశాలు జారీచేసింది.

సూచనలు
కేసు విచారణకు సంబంధించి సూచనలు ఇవ్వాలని సీనియర్ లాయర్ ప్రకాశ్ రెడ్డి మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని కూడా హైకోర్టు కోరింది. గురువారం విచారణ సమయం వరకు ఎఫ్ఐఆర్ కాపీ, డాక్యుమెంట్లు, సీడీలు సమర్పించాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత మరునాడు కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. శుక్రవారం వరకు మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications