జూటా కోర్, తుపాకీ రాముడు.. కేసీఆర్, కేటీఆర్పై జేజమ్మ అరుణ నిప్పులు
గ్రేటర్ ప్రచారం ఊపు మీదుంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య వార్ పీక్ కి చేరుకుంది. జేజమ్మ డీకే అరుణ తనదైనశైలిలో విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జూటా కోర్.. ఆయన కుమారుడు కేటీఆర్ తారకరాముడు కాదు.. తుపాకి రాముడు అన్నారు. ప్రచారంలో భాగంగా ఐ ఎస్ సదన్ డివిజన్ చింతల్ బస్తీలో బీజేపీ అభ్యర్థి జంగం శ్వేతా మధుకర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఓట్ల కోసం ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తున్న పథకాల పేర్లు మార్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. ఆ జూట మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. దుబ్బాక ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకున్నారని.. అలా భాగ్యనగర ప్రజలు కూడా వ్యవహరించాలన్నారు.
గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళుతోంది. కేటీఆర్, కేసీఆర్ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏమీ చేయలేదు అని విమర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఓటరు నాడీ ఎలా ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.