పైలట్ రోహిత్ రెడ్డిని 6 గంటలపాటు ఈడీ విచారణ, రేపు కూడా: ఎమ్మెల్యే ఏమన్నారంటే?
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ సోమవారం ముగిసింది. దాదాపు 6 గంటలపాటు ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ మరోసారి పిలుపు: ఎందుకంటే?
ఈడీ అధికారులు తనను కేవలం బయోడేటా గురించి అడిగారని రోహిత్ రెడ్డి తెలిపారు. విచారణ కోసం మళ్లీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు రావాలని చెప్పారని ఆయన తెలిపారు. నన్ను ఎందుకు విచారణకు పిలిచారు? ఏ కేసులో విచారించేందుకు పిలిచారు? అనేది చెప్పమని అడిగితే.. ప్లీజ్ కోఆపరేట్ విత్ అజ్ అని ఈడీ అధికారులు బదులిచ్చారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. అంతేతప్ప ఈడీ అధికారులు తనకు సరైన సమాధానం చెప్పలేదన్నారు.
ఈడీ ప్రశ్నలకు జవాబులు చెప్పానన్న పైలట్ రోహిత్ రెడ్డి
తాను మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పానని రోహిత్ తెలిపారు. తన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్లు చేసినట్లు తెలిపారు. ఇంకొన్ని డాక్యుమెంట్లు అడిగారు.. అవి కూడా రేపు అంటే మంగళవారం తెచ్సిస్తానని చెప్పినట్లు వెల్లడించారు. విచారణ అధికారులు ఎంతమంది వచ్చి ప్రశ్నలు అడిగినా.. ఓపికగా జవాబులు చెప్పానని రోహిత్ రెడ్డి తెలిపారు.
ఏ కేసు గురించో తెలియడం లేదన్న పైలట్ రోహిత్ రెడ్డి
అయితే, ఈ విచారణ ఎందుకు జరుగుతుందో అంతుపట్టడం లేదన్నారు. మనీలాండరింగ్ కు సంబంధించిన ప్రశ్నలేం తనను అడగలేదని, ఏ కేసుకు సంబంధించిన వివరాలను అడగలేదని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. అంతకుముందు తనకు ఇచ్చిన నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని, దీని కోసం ఒక వారం గడువు ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డి తన పీఏ శ్రవణ్ ద్వారా ఈడీ కార్యాలయానికి లేఖ పంపించారు. అయితే, గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో తన ఆస్తులు, కంపెనీ వివరాలు, బ్యాంక్ ఖాతాలతో ఈడీ విచారణకు హాజరయ్యారు.