షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి, అసెంబ్లీ వద్ద రైతుల ఆందోళన, అరెస్ట్ (వీడియో)
సమస్యలపై రైతులు, రైతు నేతలు కదం తొక్కారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. సమీపంలో గల పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇవాళ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు ఆందోళనకు దిగారు. వేములవాడ ఎమ్మెల్యే కనిపించలేదని మరికొందరు నిరసన చేపట్టారు. ఇలా పలువురి ఆందోళనతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రైతుల ఆందోళన
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు, రైతు నేతలు గత కొంతకాలంగా ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై అసెంబ్లీ ముట్టడించారు. గోరుమంతుల ప్రవీణ్, ఇతరులు అసెంబ్లీ వద్ద ఫ్యాక్టరీ తెరిపించాలని నినాదాలు చేశారు. వారిని అరెస్ట్ చేసి.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని గత కొద్దీరోజుల నుంచి ఈ ప్రాంత రైతు నేతలు కోరుతున్నారు. ఇటు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కొందరు రైతు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి మహేందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మామిడి మహేశ్ తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేయడంతో వారు పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయారు.
ఎమ్మెల్యే కనిపించడం లేదట..
ఎమ్మెల్యే కనిపించడం లేదని వేములవాడ ప్రజలు మరోసారి అసెంబ్లీని ముట్టడించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేయలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. కరీంనగర్ మిడ్ మనేరు ప్రాజెక్ట్కు రూ.100 కోట్లు నిధులు, కొండగట్టు అభివృద్ధికి నిధులు, వేములవాడ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ కిసాన్ అసెంబ్లీని ముట్టడించింది.
హామీలు మరిచారు
అసెంబ్లీ ముట్టడికి పొన్నం ప్రభాకర్ వచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యంపేట్ నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని జగిత్యాల జిల్లా రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి, అసెంబ్లీ వద్ద రైతుల ఆందోళన, అరెస్ట్ (వీడియో)#farmersprotest #TelanganaAssembly pic.twitter.com/Z8iM2Efocc
— oneindiatelugu (@oneindiatelugu) March 24, 2021