యాచకురాలి ఇంట్లో నాలుగు సంచుల డబ్బు.. ఎంత దొరికిందో తెలుసా?
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని ఓ ఇంటిలో డబ్బు సంచులు బయటపడ్డ ఘటన చర్చానీయాంశంగా మారింది. జీడిమెట్ల పరిధిలోని దుండిగల్ రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ఓ ఇంటిలో 2 లక్షల 31వేల రూపాయలున్న నగదు మూటలు దొరికాయి. నాలుగు బస్తాల్లో 10, 100 రూపాయల నోట్లు లభ్యమయ్యాయి.
జలమండలిలో ఉద్యోగిగా పనిచేసే విజయలక్ష్మి అలియాస్ దేవి 2016 సంవత్సరంలో కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆఫీస్ కు వెళ్లి విచారించగా ఆమెను విధుల్లో నుంచి తప్పించినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో ఆమె కూతురు సంతోషి దుండిగల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే 2017 నుంచి విజయలక్ష్మి యాచకురాలిగా జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. దుండిగల్ రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలోని ఓ ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నారు. ఆరు ఏడు నెలలు అద్దె చెల్లించిన విజయలక్ష్మి కొద్ది రోజులుగా కిరాయి ఇవ్వడం లేదని తెలుస్తోంది.
మరోవైపు ఆమె కనిపించకుండా పోయినట్లు సమాచారం. దీంతో ఇంటి యజమాని విజయలక్ష్మి అద్దెకు ఉంటున్న పోర్షన్ తాళాలు పగులగొట్టారు. నాలుగు బస్తాల్లో నగదు బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. తీరా ఆ మూటలు తెరిచి చూసేసరికి అందులో 2 లక్షల 31వేల రూపాయల నగదు కనిపించింది. డి.పోచంపల్లిలో నివాసముంటున్న విజయలక్ష్మి కూతురును పిలిపించి ఈ నగదు ఆమెకు అందించారు. ఓ ఇంట్లో డబ్బులున్న సంచి దొరికిందనే వార్త వైరల్ గా మారింది. అదలావుంటే కనిపించకుండా పోయిన విజయలక్ష్మి ఆచూకీ మాత్రం ఇంతవరకు లభించకపోవడం గమనార్హం. మిస్సింగా లేదంటే ఇంకేమైనా జరిగి ఉండొచ్చా అనే విషయాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు.