గ్రేటర్ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం... చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం(నవంబర్ 20) మధ్యాహ్నంతో ముగిసింది. చివరి రోజు కావడంతో... దాదాపు 600 పైచిలుకు నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి అధికారులకు నామినేషన్లు సమర్పించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు ముఖ్యనేతలు, శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థుల తాకిడి ఎక్కువవడంతో జోనల్ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మూడు రోజుల్లో కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
నామినేషన్ల మొదటిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ 2,కాంగ్రెస్ 3,టీఆర్ఎస్ 6,టీడీపీ 5 నామినేషన్లు ఉన్నాయి. గురువారం(నవంబర్ 19) 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 చివరి రోజు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 4న కౌంటింగ్,అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. ఒకవేళ ఎక్కడైనా అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 38,56,770 మంది కాగా... మహిళలు 35,46,847 మంది ఉన్నారు. ఇతరులు 669 మంది ఉన్నారు. గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 79,290. ఇక అతి చిన్న డివిజన్ ఆర్సీ పురం... ఈ డివిజన్లో 27,948 మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్లలో 9, 248 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతినే పోలింగ్ జరుగుతుంది.
Recommended Video
ఈ ఎన్నికల కోసం 2016 నాటి రిజర్వేషన్లనే కొనసాగిస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పరిమితి రూ. 5 లక్షలు మించకూడదని ఈసీ ప్రకటించింది. 45రోజుల లోపు అభ్యర్థి ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించాలని చెప్పింది. తప్పుడు వివరాలు సమర్పిస్తే... అభ్యర్థిని 3ఏళ్ల పాటు ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించే హక్కు ఎస్ఈసీకి ఉంది.