బంగారం అక్రమ రవాణా..మిక్సర్ గ్రైండర్ లో, కటింగ్ ప్లయర్ లో కూడా..పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు . మొన్నటికి మొన్న తలపై పెట్టుకున్న విగ్గులో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తే , కొందరు స్మగ్లర్లు కడుపులో , మలద్వారం వద్ద బంగారాన్ని దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇక తాజాగా మిక్సర్ గ్రైండర్ లో, కటింగ్ ప్లయర్ లో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసిన అక్రమార్కులను శంషాబాద్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
కస్టమ్స్ అధికారులకు బంగారం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకోవడం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎవరికీ పట్టుబడకుండా, అనుమానం రాకుండా రకరకాల మార్గాల ద్వారా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు అక్రమార్కులు. ఈ క్రమంలో తాజాగా మిక్సర్ గ్రైండర్ లో, కటింగ్ ప్లయర్ లో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. మిక్సీ గ్రైండర్ లోపల బంగారాన్ని సెట్ చేసి, అలాగే కటింగ్ ప్లయర్ ను బంగారు కడ్డీలతో తయారుచేసి, ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇనుప రేకుతో కవర్ చేసి అక్రమ రవాణాకు పూనుకున్నారు.
హైదరాబాద్ కు తీసుకువచ్చిన క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు అనుమానం రావటంతో వాటిని విప్పి చూసి అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు.వారి వద్ద నుండి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు . శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటి 15 లక్షలు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్న అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.