జంట నగరాల్లో భారీ వర్షాలు: అవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ జీహెచ్ఎంసీ వార్నింగ్
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలోని బాలానగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లిలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.

భారీ వర్షంతో రహదారులు జలమయం, కరెంట్ కట్
మల్కాజిగిరి పరిసరాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షంతో ఆయా ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలు గాలులు కూడా వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అవసరమైతే తప్ప బయటికి రావొద్దు: జీహెచ్ఎంసీ వార్నింగ్
హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. క్షేత్రస్థాయిలో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. సికింద్రాబాద్, అల్వాల్, నెరేడ్మెట్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పాతం నమోదయ్యే సూచనలున్నాయని జీహెచ్ఎంసీ తెలిపింది.

హైదరాబాద్లో రేపు కూడా భారీ వర్షం
మరోవైపు, హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ మంగళవారం వర్షం కురిసింది. బుధవారం కూడా భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పుపడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications