హైటెక్ సిటీ రూట్ ప్రయాణీకులకు భారీ ఊరట.!కైత్లాపూర్ ఆర్ఓబి ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్.!
హైదరాబాద్ : విశ్వనగరం దిశగా హైదరాబాద్ వేగంగా అడుగులు వేస్తోంది. గణనీయంగా విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్ చిక్కులు లేని అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. సిగ్నల్ ఫ్రీ నగరంగా రూపొందించేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు హైదరాబాద్ నగరానికి నలువైపులా అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పధకం (Strategic Road Development project)ద్వారా మొదటి దశలో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నట్టు నగర పాలక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపాదించిన మొత్తం పనులలో ఇంకా మిగిలిపోయిన, అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ చివరి వరకు పూర్తి చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు.
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన 41 రోడ్ల నిర్మాణ పనుల్లో 29 పనులు అందుబాటులోకి వచ్చాయి. 86 కోట్ల వ్యయంతో చేపట్టిన కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (రేపు)మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ అర్ఓబీ అందుబాటులోకి రావడం వలన హై టెక్ సిటీ నుండి కూకట్ పల్లి వరకు, జేఎన్టియు నుండి హై టెక్ సిటీ వెళ్ళే వారికి కూడా ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది.
ఎస్అర్డిపి ద్వారా చేపట్టిన పనులలో దాదాపు అన్ని పనులు పూర్తి కాగా ఆర్ ఓ బి/ ఆర్ యు బి లు కైతలాపూర్ తో కలిసి మొత్తం 7 అందుబాటులోకి వచ్చాయి. ఉత్తమ్ నగర్, లాలాపేట్, తుకారాం గేట్, ఉప్పుగూడ లెవెల్ క్రాసింగ్, హై టెక్ సిటీ, ఆనంద్ బాగ్ ప్రాంతాల్లో అందుబాటులోకి రావడంతో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.