హోంగార్డు టు డీజీపీ: పోలీసుల హెల్త్ ప్రొఫైల్పై ఫోకస్, ఆరోగ్యం ఆధారంగా డ్యూటీ, 25 వేల మంది...
కరోనా వైరస్ విస్తరిస్తోన్న నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. దాదాపు 40 రోజుల నుంచి వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది పనిచేస్తూనే ఉన్నారు. ఇక పోలీసుల సంగతైతే చెప్పక్కర్లేదు. అహోరాత్రులు.. కంటి మీద కునుకులేకుండా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రొఫైల్ చెక్ చేయాలని భావించింది. ఆరోగ్యం సరిగా లేనివారికి సులువైన డ్యూటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
పోలీసుల ఆరోగ్యంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. హోం గార్డు నుంచి డీజపీ వరకు అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అందరి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆర్జీ పెట్టుకోకుండా ప్రభుత్వమే సదుపాయం కల్పించింది. ఆరోగ్యం సహకరించని వారికి తేలికైన విధులు అప్పగిస్తారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ డ్యూటీ కాకుండా.. మరో విభాగంలో బాధ్యతలు అప్పగిస్తారు.
పోలీసుల ఆరోగ్య వివరాలను ఆరోగ్య భద్రతకు లింక్ చేస్తారు. ఆరోగ్య భద్రతను టీఎస్ కాప్తో అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆరోగ్య వివరాలు ఉన్నతాధికారులకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 25 వేల మంది సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించి డేటా సేకరించినట్టు తెలుస్తోంది. మరో రెండురోజుల్లో ప్రక్రియ పూర్తవనుంది. ఆరోగ్య వివరాల డేటా ఆధారంగా హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆరోగ్యం సరిగాలేని వారికి మెరుగైన వైద్యసేవలు అందించే వెసులుబాటు కలుగనుంది.