కరోనా ఉధృతి ఉన్నా సరే .. ఒకే చోట గుంపులుగా .. అప్పుడు కుంభమేళా, ఇప్పుడు రంజాన్ ప్రార్ధనలు
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. ఇక రాష్ట్రాలలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు సంపూరణ లాక్ డౌన్ విధిస్తే, మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక కర్ఫ్యూ లను, వారాంతపు లాక్ డౌన్ లను, 144 సెక్షన్ వంటి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా రాష్ట్రాలలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇక మతపరమైన కార్యక్రమాలు కరోనా వ్యాప్తిని మరింత పెంచుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇండియాలో కరోనా : 4వేలకు పైగా మరణాల రికార్డు, మూడోరోజు వరుసగా 4లక్షలకు పైగా కేసులు
హైదరాబాద్లో సామూహికంగా రంజాన్ ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలు
ఇటీవల ఉత్తరాఖండ్లో కుంభమేళా వంటి మత సమ్మేళనాన్ని మరిచిపోకముందే, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం రోజు సామూహిక ప్రార్థనలు చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కరోనా కట్టడిని ప్రశ్నిస్తున్నాయి. కరోనా మహమ్మారి యొక్క ఘోరమైన సెకండ్ వేవ్ మధ్య శుక్రవారం ప్రార్థనలు చేయటానికి హైదరాబాద్లో భారీగా ముస్లింలు సమావేశమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
శుక్రవారం మక్కా మసీదులో వందల సంఖ్యలో ముస్లింల ప్రార్ధనలు
ముస్లింలు అత్యంత భక్తిభావంతో నిర్వహించే రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనల కోసం ప్రసిద్ధ స్మారక చిహ్నం అయిన చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో వందల సంఖ్యలో మహమ్మదీయులు ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా, ఎలాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించడం కోవిడ్ ప్రమాదాన్ని స్పష్టంగా అర్థం అయ్యేలా చేస్తుంది. ముస్లింల ప్రార్ధనల తర్వాత తెలంగాణా సర్కార్ సామూహిక సమావేశాలు నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా వ్యాప్తిని మరింత పెంచిన కుంభమేళా
వివాహాలలో 100 మందికి మించి, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి లేదు, మరియు సామాజిక, రాజకీయ లేదా మతపరమైన ఏ రకమైన బహిరంగ సభలు కూడా రాష్ట్రంలో నిషేధించబడ్డాయి. గతంలో కుంభమేళా కారణంగా ఉత్తరాఖండ్లో సామూహిక పవిత్ర స్నానాలు ఆచరించి వేలాది మంది భక్తులు కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిబంధనల వల్ల ఉన్నప్పటికీ , ఇలా మతపరమైన ప్రార్థనలు కరోనా నిబంధనలను ఉల్లంఘించి చేయడం ప్రాణాలను ప్రమాదాలకు పెట్టుకోవడమే అవుతుందని పలువురు అంటున్నారు.
రంజాన్ సమయంలో సామూహిక ప్రార్ధనలతోనూ కరోనా వ్యాప్తికి ఛాన్స్
కుంభమేళా సమయంలో కూడా కరోనా వ్యాప్తి జరుగుతుందని కుంభమేళా నిలిపివేయాలని పలువురు విమర్శలు గుప్పించారు. కుంభమేళా , ఎన్నికల ర్యాలీలు కరోనా వ్యాప్తికి కారణం అయ్యాయి. ఇప్పుడు రంజాన్ మాసంలో కూడా ఇదే తరహ సామూహిక ప్రార్థనలు జరిగితే మహమ్మారి విజృంభణం మరింత తీవ్రంగా కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి సామాజిక మతపరమైన సమావేశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే కొంతమేర కరోనా కట్టడి సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.