సెప్టెంబర్లో హుజురాబాద్ ఉప ఎన్నిక..? వ్యాక్సినేషన్పై ఫోకస్.. 80 శాతం మంది టార్గెట్
హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. బై పోల్కు సంబంధించి.. పార్టీలకు సంకేతాలు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో సెప్టెంబర్లోగా 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారుల టార్గెట్గా పెట్టుకున్నారు. ఎన్నికల సిబ్బందికి ముందే వ్యాక్సినేషన్ ఇస్తారనే మాట వినిపిస్తోంది. ఓటర్లు, నేతలకు విస్తృతంగా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

2.26 లక్షల మంది ఓటర్లు..
నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ టార్గెట్ పెట్టుకున్నారు. గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్లో ఎన్నికలు అనివార్యం కావడంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికపై దృష్టి సారించాయి. ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్పై నిప్పులు చెరుగుతూ బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

నువ్వా.. నేనా..
టీఆర్ఎస్ కూడా నియోజకవర్గంలో ఆధిపత్యం చాటేకుందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు గంగుల కమలాకర్తోపాటు టీఆర్ఎస్ నేతలు అందరూ హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేసేలా నిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ
బీజేపీ ఇంచార్జీలను కూడా నియమించింది. టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించకన్నా ప్రజల్లోకి మాత్రం వెళుతుంది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొనే అవకాశాల మెండు. కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపినా.. ఏ మేరకు ప్రభావం చూపిస్తారనే అంశం స్పష్టత లేదు. టీడీపీ, కమ్యూనిస్టులు పోటీ చేసినా.. ఎఫెక్టు మాత్రం ఉండదు. ఇక్కడ గెలవడం ఈటల రాజేందర్కు జీవన్మరణ సమస్య. టీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా ఇప్పటినుంచే కృషిచేస్తోంది.












Click it and Unblock the Notifications