హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కీలక నిర్ణయం... ఆ విద్యార్థులకు 100 శాతం ఫీజు మాఫీ...
హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా సంపాదించే పేరెంట్ను కోల్పోయిన విద్యార్థులకు 100 శాతం ఫీజు మాఫీని హెచ్పీఎస్ యాజమాన్యం ప్రకటించింది. నగరంలోని బేగంపేట,రామాంతపూర్ ప్రాంతాల్లో ఉన్న హెచ్పీఎస్ స్కూళ్లకు ఇది వర్తిస్తుంది.
అలాగే 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ప్రతీ విద్యార్థికి వార్షిక ట్యూషన్ ఫీజుపై రూ.10,000 మేర తగ్గిస్తున్నట్లు హెచ్పీఎస్ ప్రకటించింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్తో స్కూళ్లు మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే 2020-2021 విద్యా సంవత్సరానికి కూడా తాము విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇచ్చామని హెచ్పీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సెక్రటరీ తెలిపారు.
నిజానికి 2021-22 విద్యా సంవత్సరానికి 10 శాతం ఫీజును పెంచాలని యాజమాన్యం భావించినప్పటికీ ఆ ఆలోచనను విరమించుకుంది. కోవిడ్ వేళ విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రూ.10వేల ఫీజు తగ్గింపుతో పాటు కోవిడ్తో తల్లి లేదా తండ్రి చనిపోయిన విద్యార్థులకు వంద శాతం ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1923లో ఏడో నిజాం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జాగీర్దార్ కాలేజీగా దీన్ని పిలిచేవారు. కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే ఇందులో చదువుకునేవారు. 1951లో జాగీర్దార్ కాలేజీ స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా దీనికి నామకరణం చేశారు.
కోవిడ్ పరిస్థితుల్లోనూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీలు విద్యార్థులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో మానవతా దృక్పథంతో ఆలోచించి విద్యార్థులకు మేలు చేసేలా హెచ్పీఎస్ నిర్ణయం తీసుకోవడంపై వారి తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
గతేడాది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఏజేసీ పబ్లిక్ స్కూల్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. స్కూల్లో చదివే 800 మంది విద్యార్థులకు రెండు నెలల ఫీజును యాజమాన్యం మాఫీ చేసింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.