జై బాలయ్య: రూ.1.5 కోట్ల విరాళం - హైదరాబాద్ వరద బాధితులకు అండ - పాతబస్తీ వాసులకు బిర్యానీ
లక్షల మందికి అన్నం పెట్టే హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం విలయంలో చిక్కుకుపోయింది.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ వర్షాలు కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగి దయనీయ పరిస్థితికి చేరాయి. చెరువులను తలపిస్తోన్న లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మనిగాయి. జీహెచ్ఎంసీ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, మందులు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ వరదబాధితులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు..

రూ.1.5 కోట్ల విరాళం..
హైదరాబాద్ నగరంలో వందేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురవడం, దాని ప్రభావం తగ్గిందనుకునే లోపే శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా మళ్లీ వానలు పడటంతో పలు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ వరద బాధితుల సహాయార్ధం నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. 60 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయి, వేల సంఖ్యలో పునరావాస కేంద్రాల్లో కాలం గడుపుతోన్న ప్రస్తుత తరుణంలో బాధితుల కోసం బాలయ్య రూ.1.50 కోట్ల విరాళం ప్రకటించారు. అంతేకాదు..

1000 కుటుంబాలకు బిర్యానీ..
హైదరాబాద్ సిటీలో తాజా వర్షాలకు ముసీ నది ఉప్పొంగడంతో దాని పక్కనే ఉన్న పాతబస్తీపై తీవ్ర ప్రభావం పడింది. ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికావడంతో వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాలకృష్ణ స్ఫూర్తితో ఏర్పాటైన బసవతారకరామా సేవసమితి ఆధ్వర్యంలో ఆదివారం 1000 కుటుంబలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేసే ఏర్పాట్లు చేశారు.
Recommended Video

బాలయ్య బాటలో ఇంకొందరు..
హైదరాబాద్ తో తనది విడదీయలేని బంధమని బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుత వరద పరిస్థితుల్లో బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన ఆయన.. ఇంకా ఏదైనా అవసరం పడితే తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ఆదివారం బాలయ్య ప్రకటన వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. జై బాలయ్య, రియల్ హీరో అంటూ జనం ఆయనను మెచ్చుకున్నారు. బాలయ్య బాటలోనే టాలీవుడ్ కు చెందిన ఇతరులు కూడా హైదరాబాద్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేయం చేసేందుకు ముందుకురానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications