వాన్ని నడిరోడ్డుపై ఉరితీయాలి-గంజాయి మాఫియాతో నిందితుడికి లింకులు-హత్యాచార ఘటనపై నిప్పులు చెరిగిన సీతక్క
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగి నాలుగు రోజులైనా ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేద గిరిజన బిడ్డ కాబట్టే ప్రభుత్వం సత్వర న్యాయం దిశగా చర్యలు తీసుకోవట్లేదని పలువురు విమర్శిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యే సీతక్క సింగరేణి కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం : సీతక్క
'మహానగరంలో భవిష్యత్తు బాగుపడుతుందనుకున్నారు కానీ... ఇలా పక్కింట్లో ఉన్నవాడే బిడ్డను అత్యాచారం చేసి చంపేస్తాడని ఆ కుటుంబం ఊహించలేదు. ఇంత మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం గిరిజన ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు,ఈ ఘటనపై మాట్లాడకపోవడం దారుణం.ఆ గిరిజన కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. డ్రగ్స్,గంజాయి,పబ్బుల కల్చర్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ దుర్మార్గుడు బిడ్డకు కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉందట.భార్య కూడా వాడి దుర్మార్గాలను తట్టుకోలేకపో వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఇలాంటి రాక్షసులు సమాజంలో ఉండకూడదు.ఉంటే ఆడజాతి మనుగడకే ప్రమాదం.' అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

నడిరోడ్డుపై ఉరితీయాలి : సీతక్క
ప్రభుత్వం ఆ దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఉరితీయాలని సీతక్క డిమాండ్ చేశారు.'ఇప్పటికైనా ప్రభుత్వం బహిరంగంగా ప్రజల మధ్యన వాడిని శిక్షించాలి. ఈరోజు వరకు అరెస్టయిన సంగతి చెప్పట్లేదంటే ఎందుకీ పరిస్థితి నెలకొంది.వాడితోని ఎవరైనా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా... పబ్బుల వ్యాపారం చేయిస్తున్నారా... అరెస్ట్ చేసినట్లుగా ఎందుకు ప్రకటించలేదు. శిక్ష గురించి మాట్లాడకుండా కలెక్టర్ వచ్చి ఏదో మాట్లాడిపోయారు.డ్రగ్స్ దందాలో వాడు కీలకంగా ఉన్నాడేమో. ఏదో పెద్ద హస్తమే ఉన్నది. వాడిని అడ్డుపెట్టుకుని పెద్ద దందానే జరుగుతుంది. కేటీఆర్ ఇక్కడికి వచ్చి ఈ కుటుంబానికి భరోసానివ్వాలి. ట్విట్టర్లో మాట్లాడితే సరిపోదు. నిరసన తెలియజేసినందుకు బాధిత కుటుంబాన్ని కొట్టారు.అవసరమైతే మేము పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తాం. విచారణ ఎందుకింత గోప్యంగా జరుగుతుందో తెలియాలి.' అని సీతక్క నిప్పులు చెరిగారు. ఓ సినీ నటుడి బైక్ యాక్సిడెంట్ వార్తకు కవరేజ్ ఇచ్చిన మీడియా... చిన్నారి హత్యాచార ఘటనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు.
కేసీఆర్,కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు...
బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు సీతక్క. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించట్లేదని ప్రశ్నించారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని విమర్శించారు. కేవలం కలెక్టర్ను పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.

ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ ఇంతవరకూ బాధిత కుటుంబంతో మాట్లాడిన పరిస్థితి లేదు. మంత్రి కేటీఆర్ కేవలం ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. బాలిక హత్యాచార ఘటన తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని... ఈ ఘటన చాలా బాధకరమని పేర్కొన్నారు. నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారని తెలిపారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కీచకుడికి కఠిన శిక్ష పడేలా చుడాలని హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.

ఇలా వెలుగులోకి....
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్ పలు వివరాలు సేకరించారు.
Recommended Video

భద్రాద్రి కొత్తగూడెంలో మరో ఘటన
ఓవైపు హైదరాబాద్లో గిరిజన బాలిక హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతుండగా.. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది.ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పరిధిలోని పలువురు వలస ఆదివాసీలు ఇటీవల కూలీ పనుల నిమిత్తం భద్రాచలం వచ్చి తాపీ మేస్త్రీల వద్ద ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం పనికి వెళ్లిన సమయంలో సుతారి మేస్త్రీలు ఉద్దేశపూర్వకంగా పని సమయాన్ని ఆలస్యం చేసి ఇద్దరు మైనర్లయిన కూలీలపై అత్యాచారయత్నం చేశారు. ఈ సమయంలో సుతారి మేస్త్రీలు తమను కొట్టారని ఇద్దరు బాధితులు స్థానికులకు తెలిపారు. ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికుల సహకారంతో బాధితులు ఆదివారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీ డాక్టర్ వినీత్కు ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న ఏఎస్పీ.. సుతారీ మేస్త్రీలపై కేసు నమోదు చేయాలని భద్రాచలం సీఐ స్వామికి సూచించారు












Click it and Unblock the Notifications