హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం... రెయిలింగ్లో తల ఇరుక్కుని యువకుడి మృతి...
హైదరాబాద్లోని అమీర్పేట చౌరస్తాలో శుక్రవారం(డిసెంబర్ 11) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గిరీష్(24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని కేపీహెచ్పీ కాలనీకి చెందిన గిరీష్ గుప్తా(24),అతని స్నేహితుడు రవితేజ శుక్రవారం ఉదయం బైక్పై పంజాగుట్ట వైపు బయలుదేరారు. ఈ క్రమంలో అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బైక్ డ్రైవ్ చేసిన గిరీష్ గుప్తా తల మెట్రో స్టేషన్ రెయిలింగ్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూపరులను తల్లడిల్లేలా చేసింది.
Recommended Video
తీవ్రంగా గాయపడిన రవితేజను స్థానిక పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవితేజ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... గ్యాస్ కట్టర్తో రెయిలింగ్ ఇనుప కడ్డీలను తొలగించి గిరీష్ గుప్తాను బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో తెలంగాణలో తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో ఓ కారు బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో మరొకరు గాయపడగా... ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. బోల్తా కొట్టిన కారు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.