నీరు దొరకడం లేదెమో.. మద్యం మాత్రం ఏరులై పారుతోంది.. ప్రజా ప్రస్థానంలో వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండో రోజు అదే జోరుతో కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు నక్కలపల్లి గ్రామంలో మొదలైన మహా పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వృద్ధులు, మహిళలు, రైతులు, కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ షర్మిల ముందుకు సాగారు. మహిళలు, వృద్ధులు తమ బాధలు చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు. నక్కలపల్లి నుంచి కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, కవ్వడిగూడ, మల్కాపురం గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర సాగింది. రెండో రోజు మొత్తం 12.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు
మల్కాపురంలో నిర్వహించిన మాట-ముచ్చట కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కేసీఆర్ పాలనలో తమ బతుకులు బుగ్గిపాలు అయ్యాయని కంటతడి పెట్టారు. ఇండ్లు లేక గుడిసెల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానలకు ఇండ్లు కూలిపోయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. భర్త చనిపోయి రెండేళ్లు అవుతున్నా పింఛన్లు రావడం లేదన్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేదన్నారు. ఆఫీసర్లు ఏ పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అర్ధ ఎకరం భూమి ఉన్నా రేషన్ కార్డు తొలగించారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకున్నారే తప్ప ఇండ్లు, పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారని, ప్రైవేటు హాస్పిటళ్లు లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయని పేర్కొన్నారు. ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చినా భూముల పంచాయితీలు తెగలేదన్నారు. సర్పంచులకు తమ బాధలు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. గ్యాస్, కరెంట్ బిల్లు పెరిగి భారంగా మారాయని ఆవేదన చెందారు. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, ఎక్కడా పని దొరకడం లేదన్నారు.
సంక్షేమం..
వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్న సమయంలో రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన తొలి నేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఐదేళ్లలో ఒక్క పన్ను పెంచకుండా అద్భుతమైన పాలన సాగించారు. రైతులకు రుణమాఫీ చేశారు. పేదింటి బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదించారు. వైఎస్ఆర్.. పేదల గురించి మాత్రమే ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. 108, 104 సేవల ద్వారా ఉచిత వైద్యం అందించారు. ఐదేళ్లలో మూడు సార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించారు. వైఎస్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరగలేదు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా రంగారెడ్డి జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారని వివరించారు.
మోసపూరిత హామీలు
కేసీఆర్ మాత్రం మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను దగా చేస్తున్నారని షర్మిల విరుచుకుపడ్డారు. జిల్లాకు కృష్ణా నీళ్లు తెస్తామని చెప్పి మోసం చేశారు. రైతులు ఏ పంట వేయాలో కేసీఆరే డిసైడ్ చేస్తున్నారని ఫైరయ్యారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని.. ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. కేవలం 3 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, 36 లక్షల మందికి ఎగ్గొట్టాడు. కేసీఆర్ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని చెప్పారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. మూడెకరాలు భూమి ఇస్తానని చెప్పిన విషయం గుర్తుచేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పారు. ఇలా అందరి చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంగ్లీషు చదువులు లేవు కాని ఇంగ్లీషు మందు మాత్రం దొరుకుతోంది. కేసీఆర్ ను నమ్మి, సీఎంను చేస్తే బంగారు తెలంగాణ పేరుతో బారుల తెలంగాణ, బీరుల తెలంగాణ చేశారని విమర్శించారు. వైఎస్ఆర్ ఉన్న సమయంలో మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కేసీఆర్ మాత్రం మహిళలకు కనీసం రుణాలు కూడా ఇవ్వడం లేదు.
Recommended Video
చదువు లేదు.. సంధ్య లేదు
కేసీఆర్ పాలనలో పిల్లలు చదువుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇప్పటికే 3,500 స్కూళ్లు బంద్ చేయించారని ఫైరయ్యారు. 14 వేల మంది టీచర్లను తొలగించాడని.. కష్టం మనది.. దోచుకోవడం కేసీఆర్ కుటుంబానిదా అని అడిగారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కాచుకోమంటున్నాడు. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. చస్తే చచ్చారులే.. ఉద్యోగాలు అడిగేవారు ఉండరని కేసీఆర్ అనుకుంటున్నాడు. తెలంగాణలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మారాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికే మేం పాదయాత్ర చేపడుతున్నాం. ప్రభుత్వం మెడలు వంచేందుకే మా పోరాటం. ఈ రెండేండ్లలో కేసీఆర్ దిగి వచ్చి, ప్రజలకు క్షమాపణ చెప్పి, సమస్యలు పరిష్కరించాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు గట్టి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజలు తన పార్టీని ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానని, వైయస్ఆర్ బిడ్డగా మీకు మాట ఇస్తున్నానని చెప్పారు. తన బతుకంతా తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తానని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో ప్రజా ప్రస్థానం యాత్ర రెండో రోజు ముగించుకొని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.