జయరాం హత్య: 'శిఖా చౌదరి ఆస్తిపై కన్నేసిందా, ఏపీ పోలీసుల్ని ప్రభావితం చేసిందా?'
హైదరాబాద్/అమరావతి: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా రాకేష్ రెడ్డిని తేల్చారు. ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని ప్రాథమికంగా తేలిందని పోలీసులు చెప్పారు. అయితే జయరాం సతీమణి పద్మశ్రీ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శిఖాచౌదరి పాత్రపై దర్యాఫ్తు చేయాలని ఫిర్యాదు చేశారు.
మీడియా ముందుకు శిఖా చౌదరి తల్లి
ఈ నేపథ్యంలో శిఖా చౌదరి తల్లి ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. కేసు విషయమై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అయితే తాను మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని అన్నారట. దీంతో శిఖా చౌదరి తల్లి ఏం చెప్పనున్నారనేది ఆసక్తికరంగా మారింది. తనకు తన సోదరి నుంచి ప్రాణహానీ ఉందని 2016లోనే జయరాం తనకు చెప్పారని పద్మశ్రీ ఇటీవల చెప్పడం గమనార్హం.
కేసును బదలీ చేయాలని డిమాండ్
కాగా, మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పద్మశ్రీ మాట్లాడారు. తన భర్త హత్యపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. హత్య హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి కేసును ఇక్కడికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. (అయితే కేసును నందిగామ పోలీసులు ఇప్పటికే హైదరాబాదుకు బదలీ చేశారు. అయితే ఆర్డర్స్ రావాల్సి ఉందని, వచ్చాక మొదటి నుంచి విచారిస్తామని పోలీసులు చెప్పారు.) జయరాంకు ప్రాణ హాని జరిగిన సమయంలో శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి ఎందుకు వచ్చిందో స్పష్టం కావాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉందని, వాచ్మన్ను అడిగితే శిఖా చౌదరి వచ్చి పత్రాల కోసం వెతికిందని చెప్పాడని పద్మశ్రీ చెప్పారు.
జయరాం హత్య కేసు, శిఖాచౌదరికి క్లీన్చిట్: ఎన్నో ట్విస్ట్లు... పోలీసులేం చెప్పారంటే?
శిఖాచౌదరి ఆస్తిపై కన్నేసిందా?
ఆస్తిపై కన్నేసి శిఖా చౌదరి ఇలా చేసిందా తేలాల్సి ఉందని పద్మశ్రీ అన్నారు. ఏపీ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జయరాంతో తనకు ముప్పై ఏళ్ల క్రితం పెళ్ళయిందని చెప్పారు. ఆయన మృతి తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఆయనకు గొప్ప విజన్ ఉందన్నారు. తన భర్తకు ఎందుకు చంపారో తెలియాలన్నారు. ఒక జీవితం విలువ రూ.80 లక్షలా అన్నారు. తాను క్రిమినల్స్ను ఉద్దేశించి అడుగుతున్నానని, ఈ హత్యకు జవాబుదారి ఎవరని, తన జీవితాన్ని నాశనం చేశారన్నారు.
నా ప్రమేయం లేకుండానే నా జీవితంలోకి శిఖా చౌదరి
తాను అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారని, ఇక్కడికు వచ్చాక హత్య అని తెలిసిందని, ఈ నాలుగు రోజులు కేసు దర్యాప్తు టీవీ సీరియల్ను తలపించిందని, జయరాం హత్యపై అనుమానాలను పోలీసులు నివృత్తి చేయాలన్నారు. హత్య హైదరాబాద్లో జరిగితే మృతదేహం ఏపీకి ఎందుకు తీసుకెళ్లారని, హత్యలో శిఖా పాత్ర ఉందా? లేదా? పోలీసులు తేల్చాలని పద్మశ్రీ అన్నారు. శిఖాచౌదరి తన కుటుంబంలోకి, జీవితంలోకి తన ప్రమేయం లేకుండానే వచ్చిందని, కుటుంబ సభ్యురాలిగా ఉంటూ ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని, ఏపీ పోలీసులను ఆమె ప్రభావితం చేసిందనే అనుమానాలున్నాయని, దోషులకు శిక్ష వేసి తన కుటుంబానికి న్యాయం చెయ్యాలన్నారు. జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో విలువైన వస్తువులు పోయాయని కూడా పద్మశ్రీ చేశారు. జయరాం చేతి గడియారంతో పాటు కీలకమైన పత్రాలు కనిపించడం లేదని, శిఖాచౌదరిపై అనుమానం ఉందని పేర్కొన్నారు.